కరోనా ఎఫెక్ట్: దేవాలయాల్లోకి భక్తుల అనుమతులపై దేవాదాయ శాఖ మార్గదర్శకాలు జారీ

By narsimha lodeFirst Published May 13, 2020, 1:08 PM IST
Highlights

 రాష్ట్రంలో ప్రధాన దేవాలయాల్లో భక్తులకు అనుమతి విషయాలపై ఏపీ దేవాదాయశాఖ త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. లాక్ డౌన్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టత ఇచ్చిన తర్వాత భక్తులకు దేవాలయాల్లో ప్రవేశంపై స్పష్టత రానుంది.


అమరావతి: రాష్ట్రంలో ప్రధాన దేవాలయాల్లో భక్తులకు అనుమతి విషయాలపై ఏపీ దేవాదాయశాఖ త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. లాక్ డౌన్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టత ఇచ్చిన తర్వాత భక్తులకు దేవాలయాల్లో ప్రవేశంపై స్పష్టత రానుంది. ఈ నెల 28వ తేదీన టీటీడీ పాలకమండలి సమావేశం ఉంది.ఈ సమావేశంలో భక్తులకు వెంకన్న దర్శనంపై నిర్ణయం తీసుకొనే ఛాన్స్  ఉంది.

ఈ నెల 17వ  తేదీ వరకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. నాలుగో విడత లాక్ డౌన్ కూడ ఉండనుందని ప్రధాని మోడీ ఈ నెల 12వ తేదీ రాత్రి ప్రకటించారు. నాలుగో విడత లాక్ డౌన్ లో కొత్త రకమైన నియమ నిబంధనలు ఉంటాయని మోడీ తేల్చి చెప్పారు.

also read:లాక్‌డౌన్ ఎఫెక్ట్: రూ. 400 కోట్ల ఆదాయం కోల్పోయిన టీటీడీ

ఇదిలా  ఉంటే ఏపీ రాష్ట్రంలో  దేవాలయాల్లో భక్తుల ప్రవేశం విషయమై దేవాదాయశాఖ ఈవోలకు మార్గదర్శకాలను జారీ చేసింది. దేవాలయాలకు వచ్చే భక్తులు భవిష్యత్తులో దేవాలయాలకు వస్తే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని దేవాదాయశాఖ ప్రకటించింది.

భౌతిక దూరం పాటించడం సహా ఎస్ఎంఎస్ ద్వారా టైమ్ స్లాట్ ను బుక్ చేసుకోవాలని దేవాదాయశాఖ ప్రకటించింది. ఈ మేరకు ఆలయాల ఈవోలు ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ ఇంచార్జీ కమిషనర్ రామచంద్రమోహన్ మంగళవారం నాడు ప్రకటించారు.

ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే భక్తులను దేవాలయాలకు అనుమతి ఇస్తారు. గంటకు 250 మంది భక్తులకు మాత్రమే దర్శనాలు కల్పించాలని సూచించారు. ఆధార్ నెంబర్ తో సహా దర్శన సమయాన్ని భక్తులకు పంపే ఎస్ఎంఎస్ లో పంపాలని దేవాదాయశాఖ సూచించింది.

అంతరాలయ దర్శనాలు, శఠగోపం, తీర్థం పంపిణీలను నిలిపివేస్తున్నట్టుగా దేవాదాయ శాఖ తేల్చి చెప్పింది. ఆలయంలోకి ప్రవేశించే ముందు సబ్బులు, శానిటైజర్లను భక్తుల కోసం అందుబాటులో ఉంచుతారు. కొన్ని చోట్ల దేవాలయాల్లోకి ప్రవేశించే మార్గా్లో శానిటైజర్లు  విడుదల చేసే సొరంగాలు ఏర్పాటు చేసే ఛాన్స్ కూడ లేకపోలేదు. 

భక్తులు కచ్చితంగా మాస్కులు ధరించేలా చూడాలని దేవాదాయశాఖ సూచించింది. మాస్కులు లేకపోతే దర్శనం నిలిపివేయనున్నారు. అంతేకాదు ఆలయ పరిసరాల్లో మాస్కులు విక్రయించేలా చర్యలు తీసుకొంటారు. భక్తులకు భక్తులకు మధ్య మీటరు దూరం ఉండేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని దేవాదాయ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించే టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకోనుంది. ఈ నెల 28వ తేదీన పాలకమండలి సమావేశం జరగనుంది.ఈ సమావేశంలో భక్తులకు స్వామివారి దర్శనంపై నిర్ణయం తీసుకోనున్నారు. లాక్ డౌన్ పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాల ఆధారంగానే టీటీడీ ఈ విషయంలో నిర్ణయం తీసుకొంటారు. 


 

click me!