
ఒంగోలు: ప్రకాశం జిల్లా ముండ్లమూరులో ఆదివారంనాడు ఉదయం భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రెండు సెకన్ల పాటు భూమి కంపించింది. భూకంపం కారణంగా ప్రజలు భయంతో ఇళ్లలో నుండి భయంతో పరుగులు తీశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో వరుసగా భూకంపాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ఏడాది మార్చి ఆరో తేదీన కర్నూల్ జిల్లా తుగ్గలి మండలం రాతసలో భూకంపం వాటిల్లింది. భూకంపంధాటికి పలు ఇళ్ల గోడలకు పగుళ్లు వచ్చాయి. సిమెంట్ రోడ్లు దెబ్బతిన్నాయి.
ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో ఏపీ రాష్ట్రంలోని ఎన్టీఆర్, పల్నాడు జిల్లాలో కూడ పలు చోట్ల భూమి కంపించింది. పులిచింతల ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో ఇటీవల కాలంలో భూప్రకంపనాలు ప్రజలను భయకంపితులు చేస్తున్నాయి. ఈ ప్రాజెక్టుకు సమీపంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన గ్రామాల్లో తరచుగా భూకంపాలు ఆందోళనలు కల్గిస్తున్నాయి.
మరో వైపు ఈ ఏడాది ఏప్రిల్ 4న తిరుపతిలో స్వల్పంగా భూప్రకంపనాలు చోటు చేసుకున్నాయి. తిరుపతిలోని దొరవారిసత్రంలో భూమి కంపించింది. దీంతో జనం భయంతో ఇళ్ల నుండి బయటకు వచ్చారు.