తాగిన మైకంలో వైన్ షాప్ సిబ్బందిపై హత్యాయత్నానికి పాల్పడటమే కాదు తనను తాను పొడుచుకుని ఆత్మమత్యాయత్నానికి పాల్పడ్డాడు ఓ తాగుబోతు.
కొండపల్లి : మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఓ తాగుబోతు వీరంగం సృష్టించాడు. వైన్ షాప్ వద్ద తాగొద్దని అన్నందుకు ఓ మందుబాబు ఆగ్రహంతో ఊగిపోతూ సేల్స్ మెన్ పై బీరు సీసాతో దాడిచేయడమే కాదు తనను తాను పొడుచుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ దారుణం ఎన్టీఆర్ జిల్లాలో వెలుగుచూసింది.
పోలీసుల కథనం ప్రకారం... ఎన్టీఆర్ జిల్లాలోని కొండపల్లి-ఈలప్రోలు రహదారిపై ప్రభుత్వమే ఓ వైన్ షాప్ నిర్వహిస్తోంది. అయితే ఈ వైన్ షాప్ చుట్టుపక్కల ఖాళీ స్థలం వుండటంతో మందుబాబులు అక్కడే మద్యం తాగుతున్నారు. ఇలా వైన్స్ చుట్టుపక్కలంతా నిత్యం మందుబాబులతో రద్దీగా వుండటంతో స్థానికులు ఇబ్బందిపడుతున్నారు. ఈ క్రమంలోనే ఎక్సైజ్ అధికారుల సూచన మేరకు వైన్ షాప్ లో సేల్స్ మెన్ గా పనిచేసే నాగ లవకుమార్ అక్కడ ఎవ్వరూ మద్యం సేవించకుండా నియంత్రించడానికి ప్రయత్నించాడు.
వీడియో
వైన్ షాప్ లో మద్యం తీసుకుని బయటకు వెళ్ళిపోవాలని... ఇక్కడెవ్వరూ తాగకూడదని లవకుమార్ మందుబాబులకు సూచించాడు. అయినప్పటికి మంగేశ్వరరావు అనే తాగుబోతు వైన్ షాప్ వద్దే మద్యం సేవించసాగాడు. దీంతో లవకుమార్ అతడిని వారించగా మద్యంమత్తులో విచక్షణ కోల్పోయిన మంగేశ్వరరావు దారుణానికి ఒడిగట్టాడు. బీర్ సీసాను పగలగొట్టి లవకుమార్ పొట్టలో, ఛాతీపై పొడిచాడు తాగుబోతు. అనంతరం అదే సీసాతో తనను పొడుచుకున్నాడు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన లవకుమార్, మంగేశ్వరరావును పోలీసులు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిద్దరి పరిస్థితి మెరుగ్గానే వుందని... ఎలాంటి ప్రాణనష్టం లేదని డాక్టర్లు తేల్చారు. వైన్ షాప్ సేల్స్ మెన్ పై హత్యాయత్నానికి పాల్పడటమే కాదు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మంగేశ్వరరావుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.