చంద్రబాబుకు షాక్: టీడీపీకి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా

By telugu teamFirst Published Mar 9, 2020, 1:39 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీకి (టీడీపీకి), ఎమ్మెల్సీ పదవికి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా చేశారు. ఈ మేరకు డొక్కా మాణిక్య వరప్రసాద్ టీడీపీ అధినేత చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి షాక్ తగిలింది. టీడీపీకి ఎమ్మెల్సీ, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా చేశారు. టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి మాత్రమే కాకుండా ఎమ్మెల్సీ పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు 

ఆ మేరకు ఆయన సోమవారంనాడు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి బహిరంగ లేఖ రాశారు. 2019 ఎన్నికల సమయంలో చివరి నిమిషంలో తనకు ప్రత్తిపాడు నియోజకవర్గం కేటాయించారని ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.  ఓటమి పాలవుతానని తెలిసినా కూడా పార్టీ ఆదేశాల మేరకు పోటీ చేసినట్లు ఆయన తెలిపారు. 

అమరావతి ఉద్యమం జరుగుతున్న సమయంలో శాసన మండలి సమావేశాలకు హాజరైతే వివాదాస్పదం అవుతాయనే ఉద్దేశంతో సభకు హాజరు కాలేదని ఆయన చెప్పారు. మండలి సమావేశాలకు ముందు తాను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాయకత్వంలోని వైసీపీలో చేరుదామని భావించానని, అయితే ఆ పార్టీ నేతలతో తాను ఏ విధమైన చర్చలు కూడా జరపలేదని ఆయన చెప్పారు. ఆయన త్వరలో వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసే అవకాశం ఉంది. ఆయన వైసీపీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది.

కాగా, వైఎస్ జగన్ మూడు రాజధానుల ప్రతిపాదనకు సంబంధించిన బిల్లు శాసన మండలికి వచ్చిన నేపథ్యంలో డొక్కా మాణిక్య వరప్రసాద్ సభకు గైర్హాజరయ్యారు. బిల్లును ఓడించేందుకు టీడీపీ కృత నిశ్చయంతో ఉండడంతో ఆయన ఆ పనిచేశారు.  

తొలుత కాంగ్రెసు పార్టీ ఉన్న మాణిక్య వరప్రసాద్ తదుపరి కాలంలో టీడీపీలో చేరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు.

 

చంద్రబాబుకు షాక్: టీడీపీకి డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా pic.twitter.com/aGLuryI1tt

— Asianet News Telugu (@asianet_telugu)
click me!