మాజీ మంత్రి దేవినేని ఉమ అరెస్ట్ పై ఎస్పీ సిద్ధార్ధ కౌశల్, డిఐజి మోహన్ రావు స్పందించారు. వైసిపి శ్రేణులను రెచ్చగొట్టేలా వ్యవహరించడంతోనే ఆయనపై దాడి జరిగిందని వారు తెలిపారు.
విజయవాడ: మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్దేశ పూర్వకంగానే ముందస్తు ప్రణాళికతోనో మంగళవారం కొండపల్లి అటవీ ప్రాంతంలో మైనింగ్ జరుగుతున్న ప్రాంతానికి ఉమ వెళ్లారని పోలీసులు చెబుతున్నారు. ఇలా జి.కొండూరులో అలజడికి దేవినేని ఉమే కారణమని... అందువల్లే ఆయనను అరెస్ట్ చేసినట్లు కృష్ణా జిల్లా పోలీసులు తెలిపారు.
ఈ ఘటనపై జిల్లా ఎస్పీ సిద్ధార్ధ కౌశల్ స్పందిస్తూ... దేవినేని ఉమ ను అరెస్ట్ చేశామని... ఇప్పుడు ఆయన తమ కస్టడీలోనే ఉన్నారన్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించినందుకే ఆయనను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ వ్యవహారంలో 100% ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేస్తామన్నారు. ఉమాపై కంప్లైంట్ ఆధారంగానే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. ఆయనపై ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ, 307 సెక్షన్ల కిత కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దేవినేని ఉమా హత్యాయత్నానికి పాల్పడినట్లు పేర్కొంటూ 307సెక్షన్ కింద కేసు నమోదు చేశామన్నారు.
డీఐజీ మోహనరావు మాట్లాడుతూ... దేవినేని ఉమ ఉద్దేశ పూర్వకంగానే జి.కొండూరులో అలజడి సృష్టించారన్నారు. ముందస్తు ప్రణాళికతోనే వివాదం సృష్టించారన్నారు. దురుద్దేశపూర్వకంగానే ఉమ కొండపల్లి నుంచి తన అనుచరులతో వెళ్లారన్నారు. మంగళవారం జరిగిన పూర్తి ఆలజడికి దేవినేని ఉమ కారణమన్నారు. వైసిపి కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా ఉమ వ్యహరించారని డిఐజి తెలిపారు.
read more దేవినేని ఉమా కారుపై రాళ్ల దాడి.. వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పనేనంటూ ఆరోపణలు
మాజీ మంత్రి దేవినేని ఉమ వాహనంపై మంగళవారం కృష్ణా జిల్లాలో వైపీపీ వర్గీయులు రాళ్లదాడికి దిగారు. మంగళవారం కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమమైనింగ్ చేస్తున్నారనే సమాచారం అందడంతో దేవినేని ఉమా వాటిని పరిశీలించేందుకు అక్కడికి వెళ్లారు. పరిశీలన పూర్తి చేసుకుని తిరిగి వస్తుండగా ఉమా కారును జి.కొండూరు మండలం గడ్డమణుగ గ్రామం వద్ద వైసీపీ వర్గీయులు అడ్డుకున్నారు. వాహనం చుట్టుముట్టి రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.
మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అనుచరులే తనపై దాడికి పాల్పడ్డారని దేవినేని ఉమా ఆరోపించారు. ఉమాపై దాడి విషయం తెలుసుకున్న టీడీపీ, వైసీపీ వర్గాలు ఘటనాస్థలికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం హైడ్రామా మద్య ఉమను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. కొద్ధి క్షణాల క్రితం మాజీ మంత్రివర్యులు దేవినేని ఉమామహేశ్వరరావు ని పెదపారుపూడి స్టేషన్ నుండి నందివాడ స్టేషన్ కి తరలించారు.