సంగం డెయిరీ కేసులో అరెస్టు: ధూళిపాళ్ల నరేంద్రకు అస్వస్థత..!

By AN TeluguFirst Published May 4, 2021, 10:54 AM IST
Highlights

మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అస్వస్థతకు గురయ్యాడు. సోమవారం రాత్రి నుంచి నరేంద్ర జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ధూళిపాళ్ల నరేంద్ర 
రాజమండ్రి సెంట్రల్ జైల్‍లో ఉన్నారు.

మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అస్వస్థతకు గురయ్యాడు. సోమవారం రాత్రి నుంచి నరేంద్ర జ్వరం, దగ్గుతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ధూళిపాళ్ల నరేంద్ర 
రాజమండ్రి సెంట్రల్ జైల్‍లో ఉన్నారు.

ప్రస్తుతం ఆయన ఆరోగ్యం దృష్ట్యా ధూళిపాళ్ల నరేంద్రను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందించాలని.. ఆయన తరఫు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ వేయనున్నారు.

కాగా, సంగం డైరీ కేసులో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో తెలుగుదేశం మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ ఐదు రోజుల కస్టడీకి తీసుకుంది. శనివారం రాజమండ్రి సెంట్రల్ జైలు విజయవాడ ఏసీబీ కార్యాలయానికి తరలించారు.

అలాగే ధూళిపాళ్ల నరేంద్ర కుటుంబ సభ్యులు విజయవాడ ఎసిబి కార్యాలయానికి వచ్చారు. సంగం డైరీ లావాదేవీల్లో ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించారనే కేసులో ధూళిపాళ్లను ఇరికించారని నరేంద్ర భార్య జ్యోతిర్మయి కంటతడి పెట్టారు.

అంతిమంగా న్యాయమే గెలుస్తుందని ధూళిపాళ్ల నరేంద్ర భార్య తెలిపారు. ధూళిపాళ్లను కలిసేందుకు ఏసీబీ కార్యాలయానికి న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణ వచ్చారు. అయితే పోలీసులు రామకృష్ణను దూళిపాళ్ల నరేంద్ర ను కలవకుండా అడ్డుకోవడంతో వాగ్వాదం జరిగింది. ఆ తరువాత కొద్దిసేపటి తర్వాత రామకృష్ణ దూళిపాళ్ల ను కలుసుకోవడానికి పోలీసులు అనుమతించారు.

కాగా, టీడీపీ సీనియర్ నేత, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రను కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతించింది. 4 రోజుల పాటు ఏసీబీ కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు ఆదేశించింది. న్యాయవాది సమక్షంలో ధూళిపాళ్లను ఏసీబీ అధికారులు విచారించనున్నారు.

ధూళిపాళ్ల నరేంద్ర కస్టడీ పిటిషన్‌పై శుక్రవారం ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. ధూళిపాళ్ల తరపున న్యాయవాది గొట్టిపాటి రామకృష్ణప్రసాద్‌ వాదనలు వినిపించారు. ప్రస్తుతం సంగం డెయిరీ ప్రభుత్వ ఆధీనంలో ఉందని, ధూళిపాళ్లను విచారించాల్సిన అవసరం ఏముందని రామకృష్ణ ప్రసాద్‌ ప్రశ్నించారు.

అయితే భూమి బదిలీ కూడా రికార్డుల్లో ఉందని.. ధూళిపాళ్ల వ్యక్తిగతంగా ఏమీ ప్రయోజనం పొందలేదని న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ధూళిపాళ్లను తమకు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ తరపు న్యాయవాదులు న్యాయస్థానాన్ని కోరారు.

సంగం డెయిరీ కేసులో మరిన్ని అంశాలను విచారించాల్సి ఉందని ఏసీబీ లాయర్లు  తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం నరేంద్ర బెయిల్‌ పిటిషన్లపై విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
 

click me!