
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీలోనే తనపై కుట్ర చేస్తున్నారని నారాయణ స్వామి ఆరోపించారు. తాను అవినీతి చేసినట్టుగా, తప్పు చేసినట్టుగా నిరూపిస్తే.. తాను వాళ్ల కాళ్లు పట్టుకుంటానని అన్నారు. గంగాధర నెల్లూరు నియోజవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న నారాయణ స్వామి మీడియాతో మాట్లాడారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి పార్టీ శ్రేణులను రెచ్చగొట్టేవారిని పార్టీ నుంచి వెళ్లగొట్టే రోజులు వస్తాయని అన్నారు.
తనపై దుష్ప్రచారం చేస్తున్న మాయలో పడొద్దని పార్టీ శ్రేణులను కోరారు. తాను అవినీతి చేశానని, తప్పు చేశానని ఎవరైనా డైరెక్ట్గా చెబితే.. వారికి సమాధానం చెబుతానని అన్నారు. తనను అవమానించిన విషయం చెబితే ఏమవుతుందో ఆ మనిషికి తెలియడం లేదని చెప్పుకొచ్చారు. అయితే పార్టీలో ఓ ముఖ్య నాయకుడిని ఉద్దేశించి నారాయణ స్వామి ఈ వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది.