అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్... జగన్ ప్రభుత్వంపై సీపీఐ రామకృష్ణ విమర్శలు, శ్వేతపత్రానికి డిమాండ్

By Siva KodatiFirst Published Dec 20, 2022, 6:51 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌ అప్పులు పెరుగుతుండటంపై జగన్ ప్రభుత్వంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, చెల్లింపులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

ఏపీ ప్రభుత్వ అప్పులపై కేంద్రం ప్రకటన నేపథ్యంలో జగన్ ప్రభుత్వంపై సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. ఏపీ కార్పోరేషన్ సహా అన్ని రకాల రుణాలు కలిపితే రాష్ట్ర అప్పులు రూ.8 లక్షల కోట్లకు పైనే వుంటాయన్నారు. కార్పోరేషన్ల రుణాలకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. రాష్ట్ర అప్పులు, చెల్లింపులపై జగన్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. 

కాగా... ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. కేంద్రప్రభుత్వం లెక్కల ప్రకారం రాష్ట్రంలో అప్పుల భారం ఏడాదికేడాది భారీగా పెరుగుతూనే ఉన్నాయి. 2018లో రూ.2,29,333.8 కోట్ల అప్పులు ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.3,98,903.6 కోట్లకు పెరిగిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి సోమవారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. 2017-18లో రుణ శాతం 9.8 శాతం తగ్గిందనీ, ఇప్పుడు అది 17.1 శాతానికి పెరిగిందని మంత్రి చెప్పారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు జీఎస్‌డీపీలో 42.3 శాతం ఉన్న అప్పుల భారం 2015లో 23.3 శాతానికి తగ్గింది.

Also REad: అప్పుల ఊబిలో దూసుకుపోతున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్.. ఒక్కొక్క‌రిపై ఎంత అప్పువుందంటే..?

2021 నాటికి ఇది జీఎస్డీపీలో 36.5 శాతానికి చేరుకుందని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం 2022-23 బడ్జెట్‌లో ప్రతిపాదించిన దానికంటే ఎక్కువ అప్పులను పెంచుతోందనీ, ఇది ఆరోగ్యకరమైన ధోరణి కాదని ఆయన అన్నారు. మొత్తం జీఎస్‌డీపీలో  25 శాతం కంటే తక్కువ రుణాన్ని కలిగి ఉన్న రాష్ట్రాలు ఆరోగ్యకరమైన ఆర్థిక స్థితిలో ఉన్నాయని మంత్రి పంక‌జ్ చౌద‌రి చెప్పారు.

మార్చి 2020 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అప్పు రూ.3,07,672 కోట్లకు చేరుకుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. అలాగే, రాష్ట్ర ప్రజల తలసరి అప్పు రూ.62,059గా ఉందన్నారు. ఏపీ అప్పు-జీఎస్‌డీపీ నిష్పత్తి 31.7 శాతానికి చేరుకుందని వివరించారు. ఈ మేరకు మంగళవారం బీజేపీ సభ్యుడు కె.లక్ష్మణ్ రాజ్యసభలో ప్రశ్న అడిగారు. 2011 జనాభా లెక్కల ఆధారంగా తలసరి రుణాన్ని లెక్కించినట్లు మంత్రి తెలిపారు. ఇవి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణాల సంఖ్య మాత్రమే. కాంట్రాక్టర్లకు పెండింగ్‌ బిల్లులు, కార్పొరేషన్‌ రుణాలు, ఉద్యోగుల పెండింగ్‌ బకాయిలు తదితరాలు కలిపితే వాటి సంఖ్య కనీసం మూడు రెట్లు పెరుగుతుంది. 

click me!