టీడీపీ నేత పట్టాభికి ఊరట .. బెయిల్ మంజూరు చేసిన కోర్ట్, కండీషన్స్ అప్లయ్

By Siva KodatiFirst Published Mar 3, 2023, 6:46 PM IST
Highlights

టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. విచారణకు సహకరించాలని.. సాక్షులను ప్రభావితం చేయరాదని పట్టాభిని కోర్ట్ ఆదేశించింది. 

టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభికి ఊరట లభించింది. ఈ మేరకు ఆయనకు న్యాయస్థానం శుక్రవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 3 నెలల పాటు ప్రతి గురువారం కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. అలాగే తమను కస్టడీకి ఇవ్వాలన్న పోలీసుల పిటిషన్‌ను న్యాయస్థానం డిస్మిస్ చేసింది. అయితే విచారణకు సహకరించాలని.. సాక్షులను ప్రభావితం చేయరాదని పట్టాభిని కోర్ట్ ఆదేశించింది. 

కాగా.. కృష్ణా జిల్లా టిడిపి కార్యాలయం వద్ద చోటుచేసుకున్న ఘర్షణల కేసులో టిడిపి అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాంతో సహా 15 మందిని పోలీసులు అరెస్ట్ చేసారు. టిడిపి కార్యాలయంపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వర్గీయులు, వైసిపి కార్యకర్తలు దాడికి పాల్పడినట్లు తెలిసి పట్టాభి అక్కడి వెళ్లారు. ఈ క్రమంలోనే దాడి సమయంలో పోలీసుల తీరును నిరసిస్తూ డిజిపి కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పట్టాభితో పాటు మరికొందరు టిడిపి నాయకులు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పట్టాభిని ఎక్కడికి తరలించారో తెలియకపోవడంతో మంగళవారం గందరగోళం నెలకొంది. పట్టాభికి ప్రాణహాని వుందంటూ ఆయన భార్య ఆందోళనకు దింగింది. ఈ క్రమంలో సాయంత్రం గన్నవరం కోర్టులో పట్టాభిని హాజరుపర్చగా తనపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు న్యాయమూర్తికి తెలిపారు. 

Also REad: పోలీసులు కొట్టలేదు.. పట్టాభి చెప్పినదంతా అబద్ధమే, మా వాళ్లపై నిందలొద్దు : కృష్ణా జిల్లా ఎస్పీ

తనను అరెస్ట్ చేసిన పోలీసులు ఎవ్వరికీ తెలియనివ్వకుండా తోట్లవల్లూరు పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు పట్టాభి తెలిపారు. స్టేషన్ లోని ఓ చీకటి గదిలోకి తనను ఈడ్చుకెళ్లి ముసుగు వేసుకుని వచ్చిన ముగ్గురు విచక్షణారహితంగా కొట్టారని అన్నారు. ముఖానికి టవల్ చుట్టి అరికాళ్లు, అరచేతులపై లాఠీలతో కొడుతూ థర్డ్ డిగ్రీ ప్రయోగించారని పట్టాభిరాం న్యాయమూర్తికి తెలిపినట్లు సమాచారం.  

అయితే పట్టాభిని పోలీసులు కొట్టారనే ఆరోపణ అవాస్తవమన్నారు కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా. తప్పుడు ఆరోపణలతో పోలీసులపై నింద వేయడం తగదన్నారు. పట్టాభి అవాస్తవాలు చెప్పి కోర్టును తప్పుదోవ పట్టించాలని చూశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాభి 3 వాహనాల్లో మనుషులతో గన్నవరం వచ్చారని.. పట్టాభి ప్రవర్తనలో గొడవలు సృష్టించాలనే దురుద్దేశం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. పట్టాభి సహా నిందితుల రిమాండ్, దర్యాప్తు పారదర్శకంగా జరుగుతోందని ఎస్పీ స్పష్టం చేశారు. టీడీపీ ఆఫీసుపై దాడి విషయంలో ఎలాంటి ఫిర్యాదు రాలేదని ఆయన తెలిపారు. సుమోటోగా కేసు నమోదు చేసి.. 9 మందిని అరెస్ట్ చేశామని కృష్ణా జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. 
 


 

click me!