
అమరావతి: కరోనా థర్డ్ వేవ్ (corona third wave) ఆంధ్ర ప్రదేశ్ లో అడ్డూ అదుపు విజృంభిస్తోంది. ఒకరోజులోనే 15వేలకు చేరువలో కేసులు బయటపడ్డాయంటేనే కరోనా తీవ్రత ఏ స్థాయిలో వుందో అర్థం చేసుకోవచ్చు. సామాన్యులు మొదలు రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు సైతం ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ఇప్పటికే అనేక మంది రాజకీయ నాయకులు ఈ వైరస్ బారిన పడగా తాజాగా మరో ఇద్దరు వైసిపి ఎంపీలకు పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది.
కాకినాడ ఎంపీ వంగా గీత (vanga geetha), రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ (marghani bharath) స్వల్ప లక్షణాలతో బాధపడుతూ టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. కాకినాడ ఎంపీతో పాటు పీఏ, గన్ మెన్ కూడా కరోనా పాజిటివ్ గా తేలింది.
కరోనా బారినపడ్డ ఎంపీలు డాక్టర్ల సూచన మేరకు హోంఐసోలేషన్ లోకి వెళ్లారు. ప్రస్తుతానికి తాము ఆరోగ్యంగానే వున్నామని... పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అనుచరులు ఎవ్వరూ ఆందోళన చెందవద్దని సూచించారు. ఇటీవల తమను కలిసివారు ముందుజాగ్రత్తలో భాగంగా కరోనా టెస్ట్ చేయించుకోవాలని అధికార పార్టీ ఎంపీలు భరత్, గీత సూచించారు.
ఇదిలావుంటే ఇప్పటికే మంత్రులు కొడాలి నాని (kodali nani), అవంతి శ్రీనివాస్ (avanthi srinivas), మేకపాటి గౌతమ్ రెడ్డి (mekapati goutham reddy), ధర్మాన కృష్ణదాస్ (dharmana krishnadas) కూడా కరోనా బారినపడిన విషయం తెలిసిందే. అయితే కరోనా బారినపడ్డ మంత్రుల్లో కొందరు హోంఐసోలేషన్ ముగించుకుని సంపూర్ణ ఆరోగ్యంతో సురక్షితంగా బయటపడ్డారు.
ఏపీ విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి (balineni srinivas reddy) నివాసంలోనూ కరోనా కలవరం రేగింది. మంత్రి భార్య శచీదేవి (sachi devi) కరోనా లక్షణాలతో బాధపడుతుండటంతో టెస్ట్ చేయించేకోగా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. అయితే మిగతా కుటుంబసభ్యులెవ్వరికీ ఈ వైరస్ వ్యాపించపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అయితే ముందుజాగ్రత్తలో భాగంగా కరోనా నిర్దారణ అయిన భార్యతో పాటు మంత్రి బాలినేని, ఇతర కుటుంబసభ్యులు హోంఐసోలేషన్ లోకి వెళ్లారు.
వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు (Ambati Rambabu) కరోనా పాజిటివ్గా నిర్దారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. గతంలోనూ ఎమ్మెల్యే కరోనా బారినపడగా ఇటీవల మరోసారి పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో ఆయన కొన్నిరోజులు హోంఐసోలేషన్ లో వుండాల్సి వచ్చింది.
ఇదిలావుంటే టిడిపి చీఫ్ చంద్రబాబు ఇంట్లో కరోనా కలవరం రేగింది. ఆయనతో పాటు తనయుడు నారా లోకేష్ కు కూడా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో నారా కుటుంబసభ్యులే కాదు టిడిపి శ్రేణులంతా ఆందోళనకు గురయ్యారు.
తనకు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయినట్లు చంద్రబాబే స్వయంగా ప్రకటించారు. తనకు కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని... టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా తేలినట్లు తెలిపారు. దీంతో వెంటనే తాను హోం క్వారంటైన్లోకి వెళ్లినట్టు పేర్కొన్నారు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. అంతేకాదు, తనతో కాంటాక్టులోకి వచ్చిన వారూ వెంటనే కరోనా టెస్టు చేసుకోవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.
ఇక ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గ టిడిపి మాజీ ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి (ugranarasimha reddy) కూడా కరోనా బారినపడ్డారు. ఇదే జిల్లాలోని గిద్దలూరు (giddaluru) ఎమ్మెల్యే అన్నా రాంబాబు (anna rambabu)కు కూడా కరోనా నిర్దారణ అయ్యింది.
ఇక ఏపీలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతూ పోతున్నాయి. గతవారంలో ఐదు వేలు, ఆరు వేలు నమోదు అయినా కేసులు సంక్రాంతి తర్వాత ఒక్కసారిగా కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. తాజాగా(ఆదివారం సాయంత్రం నాటికి) 46,650 శాంపిల్స్ను పరీక్షించగా 14,440 మందికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇందులో అత్యధికంగా.. విశాఖ జిల్లాలో 2258 కేసులు నమోదు కాగా.. చిత్తూరు జిల్లాలో 1198 కేసులు, అనంతపురం జిల్లాలో 1534 కేసులు, గుంటూరు జిల్లాలో 1458 కేసులు, ప్రకాశం జిల్లాలో 1399 కేసులు నమోదనట్టు ఆర్యోగ నిపుణులు వెల్లడించారు. ఇతర జిల్లాల్లోనూ అదే స్థాయిలో కొత్త కేసులు గుర్తించారు.