జగన్ కు కరోనా టెస్ట్... ఫలితాన్ని ప్రకటించిన వైద్యులు

By Arun Kumar PFirst Published Apr 17, 2020, 8:34 PM IST
Highlights

ఏపి సీఎం జగన్మోహన్ రెడ్డికి ఇవాళ కరోనా పరీక్ష నిర్వహించగా తాజాగా ఈ ఫలితాన్ని వైద్యులు వెల్లడించారు. 

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ కోవిడ్‌ –19 పరీక్ష చేయించుకున్న విషయం తెలిసిందే. ర్యాపిడ్‌ టెస్టు కిట్ల ద్వారా ఆయనకు పరీక్ష చేయగా నెగెటివ్ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. కోవిడ్‌ –19 కంట్రోల్‌సెంటర్‌లో స్టేట్‌ కో–ఆర్డినేటర్‌గా ఉన్న డాక్టర్‌ రాంబాబు ముఖ్యమంత్రికి పరీక్ష నిర్వహించారు. 

ఈ ఉదయం దక్షిణ కొరియా నుంచి ప్రత్యేక చార్టర్‌ విమానంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక లక్ష ర్యాపిడ్‌ టెస్టు కిట్లు వచ్చాయి. ఈ కిట్‌ ద్వారానే సీఎంకు వైద్యులు పరీక్ష నిర్వహించారు. కోవిడ్‌ –19 పరీక్షలు చేయించుకునేందుకు ప్రజలెవ్వరూ సంకోచం చెందొద్దని, నిరభ్యంతరంగా, ఎలాంటి సందేహం లేకుండా టెస్టులు చేయించుకోవాలనే సందేశం ఇవ్వడానికి ముఖ్యమంత్రి పరీక్ష చేయించుకున్నారని డాక్టర్‌ రాంబాబు తెలిపారు. 

కేవలం ఒక రక్తపు బొట్టుతో ఈ పరీక్ష నిర్వహిస్తారని డాక్టర్ వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం గణనీయంగా కోవిడ్‌–19 పరీక్షల సామర్థ్యాన్ని మెరుగుపరుచుకుందని, ర్యాపిడ్‌ టెస్టు కిట్ల ద్వారా కంటైన్‌మెంట్‌ జోన్లలో విస్తృతంగా పరీక్షలు నిర్వహించడానికి అవకాశం ఏర్పడిందని ఆయన వివరించారు. పాజిటివ్‌ తేలినంత మాత్రాన ఎవ్వరూ ఆందోళన చెందవద్దని.. కోవిడ్ ఆసుపత్రులు, క్వారంటైన్లలో  మంచి వైద్య సదుపాయాలు, వసతులు ఉన్నాయని, మంచి ఆహారం, మంచి చికిత్స అందిస్తున్నామని రాంబాబు తెలిపారు.


 

click me!