మీ సహకారానికి కృతజ్ఞతలు...కానీ నాదో సలహా..: మోదీతో సీఎం జగన్ (వీడియో)

By Arun Kumar PFirst Published Jul 16, 2021, 3:11 PM IST
Highlights

దేశవ్యాప్తంగాా ప్రస్తుత కరోనా పరిస్థితుల గురించి చర్చించేందుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్ ప్రధానికి కొన్ని సలహాలు, సూచనలిచ్చారు. 

అమరావతి:  కోవిడ్‌ నివారణ కోసం ఆంధ్ర ప్రదేశ్ కు కేంద్రం చేసిన సాయానికి మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో అన్నారు సీఎం జగన్. కోవిడ్‌ నివారణా చర్యలపై వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎం జగన్‌ ప్రధానికి కృతజ్ఞతలు తెలపడంతో పలు సలహాలిచ్చారు. 

''రాష్ట్ర విభజన వల్ల వైద్యపరంగా మౌలిక సదుపాయాల సమస్యను ఎదుర్కొన్నాం. అత్యాధునిక వైద్య సదుపాయాలు రాష్ట్రంలో లేవు.  రాష్ట్ర విభజన వల్ల హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాంటి నగరాలు ఏపీలో లేవు.  అయినా సరే కోవిడ్‌ను ఎదుర్కోవడంలో చెప్పుకోదగ్గ పనితీరు కనపరిచాం'' అని పేర్కొన్నారు. 

వీడియో

''రాష్ట్రంలో ఏర్పాటు చేసుకున్న గ్రామ, వార్డు సచివాలయాలు కరోనా వైరస్‌ విస్తరణను అడ్డుకోవడంలో సమర్థవంతంగా పనిచేశాయి. ఇప్పటివరకూ రాష్ట్రంలో 12 సార్లు ఇంటింటికీ ఫీవర్‌ సర్వే చేశాం. లక్షణాలు ఉన్నవారిని గుర్తించి ఫోకస్‌గా టెస్టులు చేశాం. దీనివల్ల కోవిడ్‌ విస్తరణను అడ్డుకోగలిగాం'' అని ప్రధానికి వివరించారు. 

''వ్యాక్సినేషన్‌ అనేది కోవిడ్‌కు సరైన పరిష్కారం. దీనికి సంబంధించి కొన్ని సూచనలు చేయదలుచుకున్నాను. ఇప్పటివరకు 1,68,46,210 వ్యాక్సిన్‌ డోసులు రాష్ట్రానికి వచ్చాయి. వీటితో 1,76,70,642 మందికి వ్యాక్సిన్లు ఇచ్చాం. వ్యాక్సినేషన్‌లో మంచి విధానాల వల్ల ఇచ్చినదానికన్నా ఎక్కువ మందికి వేయగలిగాం'' అన్నారు. 

read more  ఏపీలో కొత్తగా 2,526 మందికి పాజిటివ్.. 19,29,210కి చేరిన కేసులు, గోదావరి జిల్లాల్లో తీవ్రత

''జులై నెలలో 53,14,740 వ్యాక్సిన్లు మాత్రమే రాష్ట్రానికి కేటాయించారు. కానీ ఇదే నెలలో ప్రైవేటు ఆస్పత్రులకు 17,71,580 వ్యాక్సిన్లను కేటాయించారు. కానీ  క్షేత్రస్థాయిలో చూస్తే ప్రైవేట్ హాస్పిటల్స్ కు కేటాయించిన వ్యాక్సిన్లను పూర్తిస్థాయిలో ఉపయోగించుకోలేకపోతున్నారు. జూన్‌నెలలో ప్రైవేటు ఆస్పత్రుల ద్వారా వ్యాక్సినేషన్‌ చేయించుకున్న వారి సంఖ్య కేవలం 4,20,209 మాత్రమే.కాబట్టి ప్రైవేటు ఆస్పత్రుల్లో వినియోగించకుండా ఉండిపోయిన స్టాకు కోటాను తిరిగి రాష్ట్రానికి కేటాయించాలని కోరుతున్నాం. రాష్ట్రం మరింత వేగంగా వ్యాక్సిన్లు ఇవ్వడానికి ఇది దోహదపడుతుంది. కోవిడ్‌ నివారణలో మీ సలహాలు, సూచనలు, మార్గదర్శకాలను పాటిస్తూ ముందుకు సాగుతాం'' అని ప్రధానికి సీఎం జగన్ తెలిపారు. 

 ఈ కార్యక్రమంలో క్యాంప్‌ కార్యాలయం నుంచి ఉపముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతం సవాంగ్, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ కె వి రాజేంద్రనాథ్‌ రెడ్డి, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎం టీ కృష్ణబాబు, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనిజిమెంట్‌ అండ్‌ వాక్సినేషన్‌) ఎం రవిచంద్ర, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్‌ విశ్వజిత్, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 


 

click me!