మాట నిలబెట్టుకున్న జగన్: దిశా పోలీస్ స్టేషన్లు, దిశా యాప్ కూడా వచ్చేశాయ్

By telugu teamFirst Published Feb 8, 2020, 12:44 PM IST
Highlights

తాజాగా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘దిశ’ చట్టం అమలులో భాగంగా రాజమండ్రిలో తొలి ‘దిశ’ పోలీస్‌ స్టేషన్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇందాక కొద్దిసేపటికింద ప్రారంభించారు. 

రాజమహేంద్రవరం: యావత్ దేశంలోనే సంచలనం సృష్టించిన దిశా హత్యాచారం ఘటన భవిష్యత్తులో ఆడపిల్లలకు, మహిళలకు మరింత రక్షణ కల్పించే విధంగా నూతన చట్టాలు రూపొందిస్తూనే... వాటి అమలుకు మరింత పటిష్టమైన చర్యలను చేపడుతున్నాయి ప్రభుత్వాలు. 

ఇలా ముందడుగు వేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందుంటుంది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులం జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటన చేసి దిశా చట్టాన్ని రూపొందించారు. ఇప్పుడు ఆ చట్టాన్ని మరింత బలోపేతం చేస్తూ... దాని అమలుకు అవసరమైన మౌలిక అంశాల ఏర్పాటును కూడా ప్రారంభించారు. 

తాజాగా ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘దిశ’ చట్టం అమలులో భాగంగా రాజమండ్రిలో తొలి ‘దిశ’ పోలీస్‌ స్టేషన్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇందాక కొద్దిసేపటికింద ప్రారంభించారు. 

Also read: ఉన్నతాధికారులకు ఏపి సీఎస్ సమావేశం... దిశ పోలీస్ స్టేషన్ పై చర్చ

ఈ కార్యక్రమంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, తానేటి వనిత, ఎమ్మెల్యే రోజా, మహిళా కమిషన్‌ చైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ సహా డీజీపీ గౌతం సవాంగ్‌, దిశ చట్టం పర్యవేక్షణా అధికారులు దీపిక పాటిల్, కృతికా శుక్లా తదితరులు పాల్గొన్నారు. మహిళలకోసం ప్రత్యేకమైన స్టేషన్ కాబట్టి మహిళా మంత్రులు ఎమ్మెల్యేలు చాలా మంది జగన్ వెంట ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. 

ఇకపోతే రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18 దిశ పోలీస్‌ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో స్టేషన్‌లో ఇద్దరేసి డీఎస్పీలు, సీఐలు , ఐదుగురు ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లతో కలిపి మొత్తం 52 మంది పోలీస్‌ సిబ్బంది ఉండనున్నారు. 

దిశ చట్టంపై అధికార యంత్రాంగాన్ని సమన్వయ పరచడం, ప్రజల్లో ఈ చట్టంపై మరింత అవగాహన కల్పించేందుకు వీలుగా ఐఏఎస్‌ అధికారిణి కృతికా శుక్లా, ఐపీఎస్‌ అధికారి దీపికలను ప్రభుత్వం ప్రత్యేక అధికారులుగా ఇప్పటికే నియమించింది. 

ఈ పోలీస్ స్టేషన్ ని ప్రారంభించిన తరువాత జగన్ నన్నయ వర్సిటీలో దిశా చట్టంపై ఏర్పాటు చేసిన సెమినార్ లో పాల్గొంటున్నారు. అక్కడే దిశా యాప్ ను కూడా జగన్ ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో మహిళల భద్రతే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన చెప్పారు. 

click me!