సోమేశ్ కుమార్ వీఆర్‌ఎస్‌కు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్.. ఆయన సేవలను కేసీఆర్ వినియోగించుకుంటారా..?

Published : Feb 18, 2023, 02:26 PM IST
సోమేశ్ కుమార్ వీఆర్‌ఎస్‌కు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్..  ఆయన సేవలను కేసీఆర్ వినియోగించుకుంటారా..?

సారాంశం

తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్‌ కుమార్‌ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. సోమేష్ కుమార్ వీఆర్ఎస్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేశ్‌ కుమార్‌ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. సోమేష్ కుమార్ వీఆర్ఎస్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే హైకోర్టు తీర్పు నేపథ్యంలో..  సోమేశ్ కుమార్ గత నెలలో ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేశారు. అయితే వీఆర్‌ఎస్‌పై వెళ్లాలనే తన ఆలోచనను ఏపీ ప్రభుత్వానికి రిపోర్టు చేసిన రోజే సీఎం జగన్‌కు సోమేశ్ కుమార్ తెలిపినట్టుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. సోమేశ్‌ వ్యక్తిగత అభ్యర్థన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ఎలాంటి పదవిని కేటాయించలేదని తెలుస్తోంది.  

ఇక, తన వీఆర్‌ఎస్‌ను అనుమతించాలని కోరుతూ సోమేశ్‌ కుమార్‌ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  కేఎస్‌ జవహర్‌ రెడ్డికి దరఖాస్తు పంపారు. ఇందుకు తాజాగా సీఎం జగన్ ఆమోదముద్ర వేశారు. వాస్తవానికి సోమేశ్ కుమార్‌కు ఈ ఏడాది డిసెంబర్‌ వరకూ సర్వీస్‌లో కొనసాగే అవకాశముంది. ఇక, సవరించిన నిబంధల ప్రకారం.. కేంద్రం అనుమతి తీసుకోకుండానే ఏదైనా ఆల్ ఇండియా సర్వీస్ అధికారి వీఆర్ఎస్ దరఖాస్తులను క్లియర్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది.

అయితే సోమేశ్ కుమార్ భవిష్యత్ ప్లాన్ ఏమిటనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ సీఎం కేసీఆర్‌‌కు నమ్మకస్తుడిగా ముద్రపడ్డ సోమేశ్ కుమార్‌ సేవలను ఆయన ఏదో రకంగా వినియోగించుకోనున్నారని ప్రచారం సాగుతుంది. తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా సోమేశ్ కుమార్‌ను నియమించే అవకాశం ఉందని.. లేకపోతే బీఆర్ఎస్‌ పార్టీలో ఆయన సేవలను ఉపయోగించుకుంటారనే ప్రచారం కూడా ఉంది. 

ఇక, సోమేశ్ కుమార్ 1989 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఉమ్మడి ఏపీలో పలు బాధ్యతలు నిర్వహించారు. తెలంగాణ ఏర్పాటు సమయంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఉన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత గిరిజిన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శిగా, అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. 2019 డిసెంబర్ 31న తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎక్కువ కాలం పనిచేసిన సీఎస్‌గా ఉన్నారు. 

 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌ విభజన సందర్భంగా తన సీనియారిటీ ప్రకారం తాను ఆప్షన్‌ ఇచ్చిన తెలంగాణకు కాకుండా ఏపీకి కేటాయించడాన్ని సవాల్‌ చేస్తూ సోమేశ్‌ కుమార్‌ 2014లో సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రైబ్యునల్‌(క్యాట్‌)ను ఆశ్రయించారు. ఈ క్రమంలోనే సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ తెలంగాణలోనే కొనసాగేలా క్యాట్‌  తీర్పు ఇచ్చింది.  అయితే క్యాట్ ఆర్డర్‌ను నిలిపివేయాలని కోరుతూ డీవోపీటీ 2016 మార్చిలో తెలంగాణ హైకోర్టులో రిట్ అప్పీల్ దాఖలు చేసింది. డీవోపీటీ దాఖలు చేసిన రిట్ అప్పీల్‌ను విచారించిన చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ ఎస్ నందాతో కూడిన ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. 

సోమేశ్ కుమార్‌ను తెలంగాణ కేడర్‌కు కేటాయిస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వును తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. కేటాయింపు జాబితాలో జోక్యం చేసుకోవడం ద్వారా క్యాట్ తప్పు చేసిందని అభిప్రాయాన్ని కలిగి ఉన్నామని ధర్మాసనం పేర్కొంది. హైకోర్టు తీర్పు వెలువడిని కొన్ని గంటలకు.. సోమేష్‌ కుమా‌ర్‌ను తెలంగాణ నుంచి రిలీవ్ చేసి.. జనవరి 12లోగా ఏపీలో రిపోర్టు చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఆయన ఏపీ  ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఇక్కడ 8°C ఉష్ణోగ్రతలు, గడ్డకట్టే చలి.. ఈ ఏడు జిల్లాలకు డేంజర్ బెల్స్
IMD Rain Alert : అక్కడ వర్షాలు, ఇక్కడ చలి .. ఇక తెలుగు రాష్ట్రాల్లో అల్లకల్లోలమే..!