వైజాగ్‌లో బీచ్ ఐటీ కాన్సెప్ట్.. సీఎం జగన్ సరికొత్త ఆలోచన.. సముద్రం కనింపించేలా తీరం వెంబడి కంపెనీలు..!

By Sumanth KanukulaFirst Published May 19, 2022, 10:20 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టినప్పటీ నుంచి సీఎం జగన్.. విశాఖపట్నంపై ప్రత్యేక దృష్టి సారించారు. తాజాగా వర్జీనియా బీచ్ తరహాలో వైజాగ్ అభివృద్ది కోసం ‘‘బీచ్ ఐటీ’’ అనే కాన్సెప్ట్‌ను జగన్ ప్రభుత్వం ప్లాన్ చేసింది. 
 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టినప్పటీ నుంచి సీఎం జగన్.. విశాఖపట్నంపై ప్రత్యేక దృష్టి సారించారు. మూడు రాజధానుల ప్రక్రియకు శ్రీకారం చుట్టిన.. విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేయాలని భావించారు. అయితే అది వివాదంలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక, తాజాగా వర్జీనియా బీచ్ తరహాలో వైజాగ్ అభివృద్ది కోసం ‘‘బీచ్ ఐటీ’’ అనే కాన్సెప్ట్‌ను జగన్ ప్రభుత్వం ప్లాన్ చేసింది. సముద్ర తీర పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్రంలో ఐటీ రంగానికి ఊతం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 

బీచ్ ఐటీ కాన్సెప్ట్‌లో భాగంగా ప్రత్యేకంగా sea view ఉండేలా ఐటీ, ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ కంపెనీల కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నారు. అమెరికాలోని వర్జీనియాలో ఇదే విధమైన పర్యావరణ వ్యవస్థ ఉంది. వర్జీనియా బీచ్‌లో అట్లాంటిక్ మహాసముద్రం తీరం వెంబడి ఐటీ కంపెనీలు స్థాపించబడ్డాయి. 
అయితే పరిశ్రమకు అనువైన పర్యావరణ వ్యవస్థ లేకపోవడంతో ఇప్పటివరకు అనేక దిగ్గజ ఐటీ, ఐటీఈఎస్ కంపెనీలు ఏపీలోకి అడుగుపెట్టకపోవడంతో.. బీచ్ ఐటీ అనే కాన్సెప్ట్ తెరపైకి తీసుకొచ్చినట్టుగా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాలమైన తీర రేఖ ఉంది. మే 22 నుంచి స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరగనున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో సీఎం జగన్ ‘బీచ్ ఐటీ’ కాన్సెప్ట్‌ను హైలైట్ చేయనున్నారని సమాచారం. 

అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. సముద్ర వీక్షణతో కార్యాలయ స్థలాలను రూపొందించడానికి చర్చలు జరుగుతున్నాయి. 2022 డిసెంబర్‌ నాటికి విశాఖ బీచ్ వెంబడి ఉన్న ఒక స్టార్ హోటల్ కూల్చివేసే అవకాశం ఉంది. ఐటీ కంపెనీలకు అనువుగా ఉండేలా ఈ స్థలంలో ఎత్తైన భవనాన్ని నిర్మించనున్నారు. అలాగే సిరిపురం వద్ద హెచ్‌ఎస్‌బీసీ పక్కన ఉన్న ఖాళీ స్థలం కూడా sea viewతో కూడిన ఐటీ టవర్‌ను నిర్మించేందుకు ఉపయోగించుకునే అవకాశం ఉంది.

షిప్పింగ్, ఫిషింగ్ హార్బర్‌లు, మెరైన్ ఆక్వాకల్చర్, సీఫుడ్ ట్రేడ్ మరియు లాజిస్టిక్స్.. అన్నీ కూడా తీర ప్రాంత ఆధారిత పరిశ్రమలు కావడంతో వైజాగ్‌ను సముద్ర వ్యాపార కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు సీఎం జగన్ ఆసక్తి చూపుతున్నట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

ఇక, దావోస్‌లో జరిగే డబ్ల్యూఈఎఫ్ సదస్సులో 18 అంశాలపై చర్చిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తెలిపారు. అందులో బీచ్ ఐటీ కాన్సెప్ట్ కూడా ఒకటి. ‘ఈ విషయంలో రాష్ట్రానికి ప్రయోజనం ఉంటుందని తాము ఆశిస్తున్నాము మంత్రి చెప్పారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో ప్రభుత్వ ప్రత్యేకతలు,  ప్రాధాన్యతలను వివరించడానికి సీఎం జగన్‌ ఆసక్తిగా ఉన్నారని చెప్పారు. 

‘‘“బీచ్ ఐటి ప్రతిపాదన వైజాగ్‌కు కొత్త కాన్సెప్ట్. ప్రణాళికాబద్ధంగా, సరిగ్గా అమలు చేస్తే వైజాగ్ దేశంలో ఇటువంటి పర్యావరణ వ్యవస్థను కలిగి ఉన్న తొలి రెండు-అంచెల నగరం అవుతుంది. ఐటీ రంగ నిపుణులు అధునాతన పర్యావరణ వ్యవస్థలో పని చేయడానికి ఇష్టపడతారు’’ అని ఐటీ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (బ్రాండింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కమిటీ) ఛైర్మన్ ఆర్‌ఎల్ నారాయణ అన్నారు. 

click me!