
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రేపటి అనంతపురం పర్యటన వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సీఎం జగన్.. రేపు అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని నార్పల మండల కేంద్రంలో పర్యటించాల్సి ఉంది. అక్కడ నిర్వహించే జగనన్న వసతి దీవెన కార్యక్రమానికి సంబంధించిన సభలో పాల్గొని లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయాల్సి ఉండింది. సీఎం జగన్ పర్యటన సందర్భంగా చేసిన ఏర్పాట్లను కలెక్టర్ గౌతమి, ఎస్పీ శ్రీనివాసరావు, ఇతర అధికారులు శనివారం పరిశీలించారు. సీఎం జగన్ ప్రోగామ్స్ కో ఆర్డినేటర్ తలశిల రఘురాం కూడా సీఎం సభ కోసం సిద్దమవుతున్న వేదికను, ఏర్పాట్లను పరిశీలించారు.
అయితే రేపటి సీఎం జగన్ పర్యటన వాయిదా పడినట్టుగా అధికారులు తెలపారు. కొన్ని అనివార్య కారణాల వల్ల నార్పల మండల కేంద్రంలో రేపు జరగబోయే జగనన్న వసతి దీవెన కార్యక్రమం వాయిదా వేస్తున్నట్లుగా అధికారులు ప్రకటించారు. సీఎం జగన్ ఈ నెల 26న అనంతపురం జిల్లా నార్ఫల పర్యటనకు వెళ్లనున్నట్టుగా సీఎంవో అధికారులు తెలిపారు.
అయితే రేపు సాయంత్రం విజయవాడలో సీఎం జగన్ పర్యటన యథావిథిగా కొనసాగనున్నట్టుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. విజయవాడ వన్ టౌన్ విద్యాధరపురంలోని మినీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు.
ఇక, సీఎం వైఎస్ జగన్ రేపటి అనంతపురం పర్యటన వాయిదా పడటం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామల నేపథ్యంలో సీఎం జగన్.. అనంతపురం పర్యటన వాయిదా పడటం ప్రాధాన్యత సంతరించుకుంది.