Tirumala : శ్రీవారి భక్తులను గుడ్ న్యూస్.. అందుబాటులోకి 32 EV బస్సులు, ఇకపై ఫ్రీ జర్నీ

Published : Sep 16, 2026, 03:41 PM IST
Tirumala

సారాంశం

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కి దాతలు 32 ఎలక్ట్రిక్ బస్సులను అందించారు… వీటిని ఇవాళ (సెప్టెంబర్ 16న) సీఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ బస్సుల్లో భక్తులు ఉచితంగా ప్రయాణించవచ్చు.

Turumala : ప్రముఖ ఆద్యాత్మిక కేంద్రం తిరుమలలో భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పిస్తోంది టిటిడి. రిలయన్స్ ఇండస్ట్రీస్, భారత్ బయోటెక్ సహకారంతో 32 ఎలక్ట్రిక్ బస్సులను భక్తుల ప్రయాణం కోసం అందుబాటులోకి తెచ్చింది. వీటిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, టిటిడి ఛైర్మన్ బిఆర్ నాయుడు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు బస్సులో ప్రయాణించారు. వీటిలో 25 EV బస్సులను రియలన్స్, ఏడింటిని భారత్ బయోటెక్ టిటిడికి విరాళంగా అందించాయి.

ప్రతి ఏడాది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. ముఖ్యంగా బ్రహ్మోత్సవాలు, ఇతర ముఖ్యమైన పర్వదినాల సమయంలో భక్తుల రద్దీ గణనీయంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో అదనంగా ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రావడం భక్తుల రవాణా అవసరాలను తీర్చడంలో ఉపయోగపడనుంది.

అనంత్ అంబానీ హామీ నెరవేర్చిన రిలయన్స్

తిరుమలలో పర్యావరణహిత రవాణాను ప్రోత్సహించే దిశగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ గతంలో హామీ ఇచ్చారు. జూన్ 2026లో తిరుమలలో పర్యటించిన అనంత్ అంబానీ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం టీటీడీకి 25 ఎలక్ట్రిక్ బస్సులను అందించనున్నట్లు ప్రకటించారు. ఆ హామీకి అనుగుణంగా ఇప్పుడు బస్సులు అందుబాటులోకి వచ్చాయి.

బస్సుల నిర్వహణకు అవసరమైన ఛార్జింగ్ కేంద్రాలు, ఇతర మౌలిక సదుపాయాల ఏర్పాటులో కూడా రిలయన్స్ ఫౌండేషన్, టీటీడీ కలిసి పనిచేశాయి. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి అవసరమైన మౌలిక వసతులను అభివృద్ధి చేయడంలో ఈ సహకారం కీలకంగా నిలిచింది.

తిరుమలలో గ్రీన్ మొబిలిటీకి ప్రోత్సాహం

ఈ ఎలక్ట్రిక్ బస్సుల రాకతో తిరుమలలో టీటీడీ అమలు చేస్తున్న గ్రీన్ మొబిలిటీ విధానం మరింత బలోపేతం కానుంది. సంప్రదాయ ఇంధన వాహనాలపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు, కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలు ఉపయోగపడతాయి.

తిరుమల వంటి పర్యావరణపరంగా సున్నితమైన ప్రాంతంలో కాలుష్య నియంత్రణకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల భక్తులకు మరింత పరిశుభ్రమైన వాతావరణం అందే అవకాశం ఉంటుంది. అదే సమయంలో భక్తుల రవాణా అవసరాలను పర్యావరణహిత పద్ధతిలో తీర్చేందుకు ఈ బస్సులు ఉపయోగపడనున్నాయి.

ఈ ఎలక్ట్రిక్ మొబిలిటీ కార్యక్రమంలో రిలయన్స్ ఫౌండేషన్, జియో-బీపీ (Jio-bp) కలిసి పనిచేశాయి. రిలయన్స్ ఫౌండేషన్ ఈ కార్యక్రమానికి అవసరమైన సపోర్ట్ అందించగా, జియో-బీపీ ఎలక్ట్రిక్ మొబిలిటీ, ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల ఏర్పాటుకు సంబంధించిన సాంకేతిక నైపుణ్యాన్ని అందించింది. కేవలం వాహనాల సమకూర్పుతోనే పరిమితం కాకుండా, వాటి నిర్వహణకు అవసరమైన ఛార్జింగ్ వ్యవస్థలు, ఇతర మౌలిక వసతులతో కూడిన సమగ్ర ఏర్పాటుగా చేపట్టారు.

భక్తుల ప్రయాణానికి మరింత సౌకర్యం

శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య ప్రతి సంవత్సరం భారీగా ఉంటుంది. సాధారణ రోజులతో పోలిస్తే బ్రహ్మోత్సవాలు, పర్వదినాలు, వారాంతాల్లో రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి సమయంలో ప్రజా రవాణా వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో అదనంగా 32 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రావడం భక్తుల ప్రయాణ సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ఉపయోగపడనుంది. ముఖ్యంగా తిరుమలలో భక్తుల రవాణా అవసరాలకు అనుగుణంగా వీటిని వినియోగించనున్నారు.

అనంత్ అంబానీ ఏమన్నారంటే..

ఈ సందర్భంగా అనంత్ అంబానీ మాట్లాడుతూ… శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారని పేర్కొన్నారు. భక్తుల ప్రయాణానికి తోడ్పడటం తమకు గౌరవంగా, బాధ్యతగా భావిస్తున్నట్లు తెలిపారు.

తిరుమల ప్రాంతంలోని జీవవైవిధ్యాన్ని కాపాడుతూనే భక్తుల యాత్రను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు టీటీడీ చేస్తున్న ప్రయత్నాలకు 25 ఎలక్ట్రిక్ బస్సులు తమ వంతు సహకారంగా ఉంటాయని చెప్పారు. దేశవ్యాప్తంగా స్థిరమైన అభివృద్ధితో పాటు స్వచ్ఛమైన రవాణా పరిష్కారాలను ప్రోత్సహించాలనే రిలయన్స్ విస్తృత లక్ష్యంలో భాగంగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు.

రిలయన్స్ ఫౌండేషన్ కార్యకలాపాలు

రిలయన్స్ ఇండస్ట్రీస్ సామాజిక సేవా విభాగమైన రిలయన్స్ ఫౌండేషన్ వివిధ రంగాల్లో సామాజిక అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతోంది. గ్రామీణాభివృద్ధి, విద్య, ఆరోగ్యం, క్రీడలు, విపత్తు నిర్వహణ, మహిళా సాధికారత, పట్టణ పునరుద్ధరణ, కళలు, సంస్కృతి, వారసత్వ పరిరక్షణ వంటి రంగాల్లో సంస్థ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి.

నీతా అంబానీ నాయకత్వంలో రిలయన్స్ ఫౌండేషన్ సమగ్ర సంక్షేమం, మెరుగైన జీవన ప్రమాణాల కోసం వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. సంస్థ అందించిన వివరాల ప్రకారం, దేశవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కోట్లాది మంది ప్రజల జీవితాలపై ఈ కార్యక్రమాలు ప్రభావం చూపుతున్నాయి.

మొత్తంగా చూస్తే, తిరుమలలో 32 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రావడం భక్తుల రవాణా సౌకర్యాలను విస్తరించడంతో పాటు పర్యావరణహిత ప్రయాణానికి ప్రాధాన్యం ఇచ్చే దిశగా టీటీడీ చేపడుతున్న చర్యల్లో మరో ముందడుగుగా నిలిచింది.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Annadhanam Spots : ఏమండోయ్ బ్యాచిలర్స్.. ఎక్కడ, ఎప్పుడు, ఏఏ పదార్థాలతో అన్నదానం జరుగుతుందో ఈజీగా తెలుసుకోండి
Police Recruitment: కొలువుల జాతర.. 2050 పోలీస్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. నోటిఫికేషన్ ఫుల్ డిటైల్స్ ఇవే