తనపై గతంలో తిరుపతిలోని అలిపిరి వద్ద జరిగిన దాడిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్వేగభరితంగా మాట్లాడారు. అలిపిరి దాడి నుంచి తనను శ్రీవారే కాపాడారని ఆయన అన్నారు.
తిరుపతి: తనపై గతంలో తిరుపతిలోని అలిపిరి వద్ద జరిగిన దాడిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్వేగభరితంగా మాట్లాడారు. అలిపిరి దాడి నుంచి తనను శ్రీవారే కాపాడారని ఆయన అన్నారు. 24 క్లైమోర్ మైన్స్ పెట్టినా బతికానంటే ప్రజలకు సేవ చేయడానికి శ్రీవారే తనను కాపాడారని ఆయన అన్నారు.
తిరుపతి పర్యటనలో భాగంగా ఆయన శనివారం కపిలితీర్థం వద్ద పది లక్షల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. డిజీటల్ డోర్ నెంబర్ వ్యవస్థను ప్రారంభించారు. ఆ తర్వాత జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. తిరుపతిలో పుట్టి తిరుపతి నుంచే తాను రాజకీయాలు ప్రారంభించానని ఆయన అన్నారు.
తిరుపతి రాష్ట్రానికే గర్వకారణమని అన్నారు. తిరుపతిని అత్యంత నివాసయోగ్యమైన నగరంగా తీర్చి దిద్దుతానని చెప్పారు. తమ ప్రభుత్వ హయాంలోనే తిరుపతి అభివృద్ది చెందిందని అన్నారు. చిత్తూరును ఇండస్ట్రియల్ హబ్గా తయారుచేస్తామని చెప్పారు. అనేక జాతీయరహదారులతో తిరుపతిని అనుసంధానం చేస్తామని అన్నారు.
ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహిస్తున్నామని, ఈ ఏడాది 5లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేస్తున్నారని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి యువనేస్తం ప్రపంచానికే ఆదర్శమని అన్నారు.