చిత్తూరు జిల్లాలో 2019 ఎన్నికల్లో ఎక్కువ సీట్లను కైవసం చేసుకొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్లాన్ చేస్తున్నారు.
చిత్తూరు: చిత్తూరు జిల్లాలో 2019 ఎన్నికల్లో ఎక్కువ సీట్లను కైవసం చేసుకొనేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్లాన్ చేస్తున్నారు.జిల్లాలోని పుంగనూరు అసెంబ్లీ సెగ్మెంట్ నుండి పోటీ చేసేందుకు అనూషరెడ్డిని బరిలోకి దింపాలని టీడీపీ ప్లాన్ చేస్తోంది.
పుంగనూరు అసెంబ్లీ సెగ్మెంట్ నుండి గతంలో ప్రస్తుత ఏపీ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమర్ నాథ్ రెడ్డి ప్రాతినిత్యం వహించారు. అయితే నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అమర్ నాథ్ రెడ్డి పలమనేరుకు మారారు. పుంగనూరు నియోజకవర్గంలోని మూడు మండలాల్లో అమర్నాథ్ కుటుంబానికి మంచి పట్టుంది. దీంతో పుంగనూరు నుండి అమర్ నాథ్ రెడ్డి మరదలు అనూషరెడ్డిని బరిలోకి దింపితే ఎలా ఉంటుందనే విషయమై చంద్రబాబునాయుడు ఆరా తీస్తున్నారు.
ఇటీవల కాలంలో అనూషరెడ్డిని చంద్రబాబునాయుడు పిలిపించి మాట్లాడారని టీడీపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. అమర్నాథ్ రెడ్డి కుటుంబానికి పుంగనూరు ప్రాంతంలో మంచిపట్టుంది. దీంతో పుంగనూరు నుండి అనూషరెడ్డిని బరిలోకి దింపితే ప్రయోజనంగా ఉంటుందని భావిస్తున్నారు. అనూషరెడ్డితో పాటు ఆమె భర్త శ్రీనాథరెడ్డిని చంద్రబాబు పిలిపించి మాట్లాడారు. పోటీ చేసే విషయమై వారి అభిప్రాయాన్ని కూడ తెలుసుకొన్నారు.
అయితే ప్రస్తుతం పుంగనూరు టీడీపీ ఇంచార్జీగా ఉన్న బాబురెడ్డిని కూడ చంద్రబాబునాయుడు కూడ పిలిపించి మాట్లాడారని సమాచారం. పార్టీ అవసరాల రీత్యా వేరే అభ్యర్ధిని బరిలోకి దింపినా సహకరించాలని కోరినట్టు తెలుస్తోంది. భవిష్యత్తులో నామినేటేడ్ పదవులను కట్టబెట్టనున్నట్టు బాబురెడ్డికి చంద్రబాబునాయుడు హామీ ఇచ్చారనే ప్రచారం కూడ లేకపోలేదు.
అయితే పుంగనూరు నుండి ఎవరిని బరిలోకి దింపితే టీడీపీ విజయావకాశాలు మెరుగ్గా ఉంటాయనే విషయమై చంద్రబాబునాయుడు ఆరా తీస్తున్నారు.ఈ మేరకు క్షేత్రస్థాయిలో పరిస్థితుల ఆధారంగా నిర్ణయం తీసుకొంటున్నారు.