
ఆంధ్రప్రదేశ్లో అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవడం లేదని ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ అధినే చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నేటి అన్నదాతల ఆక్రందన..రేపు పెను ఉప్పెన అవుతుందని అన్నారు. ఆ ఉప్పెనలో ఈ రైతు వ్యతిరేక ప్రభుత్వం కొట్టుకుపోతుందని వైసీపీ సర్కార్పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఎందుకు ఆదుకోవడం లేదని ప్రశ్నించారు. దెబ్బతిన్న పంటల వివరాలు ఇప్పటికీ ఎందుకు వెల్లడించడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు.
రబీకి పంటల బీమా ప్రీమియం విషయంలో వాస్తవాలు దాచి పెట్టడానికి కారణాలు ఏమిటని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. అకాల వర్షాలకు అన్నదాతకు జరిగిన నష్టానికి ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం ఎక్కడ? అని అడిగారు. దెబ్బతిన్న పంట ఎంత.. కొన్న ధాన్యం ఎంత? అనేది సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతును ఆదుకోడానికి రాకెట్ సైన్స్ చదవాలా అన్న జగన్.. ఇప్పుడు ఎక్కడ ముడుచుకుని కూర్చున్నాడు? అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 15 జిల్లాల్లో పంట నష్టం జరిగితే ఒక్క రైతు దగ్గరకు కూడా సీఎం జగన్ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ‘‘మా రైతన్నల పంట మునిగింది.. పరిహారం ఇవ్వండి!’’ అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. #FarmersSufferingInAP అనే హ్యాష్ ట్యాగ్ను కూడా జత చేశారు.
ఇదిలా ఉంటే.. ఏపీలో అకాల వర్షాలకు నష్టపోయిన రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. వారిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ #FarmersSufferingInAP అనే హ్యాష్ ట్యాగ్ను టీడీపీ మద్దతుదారులు ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు. రైతుల బాధలు పట్టించుకోని సీఎం జగన్కు కనువిప్పు కలగాలని ట్వీట్స్ చేస్తున్నారు.