ఏపీకి రాబోయే కీలక ప్రాజెక్టులివే.. మంత్రులు, ఎంపీలకు బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు

Published : Jul 20, 2024, 09:28 PM IST
ఏపీకి రాబోయే కీలక ప్రాజెక్టులివే.. మంత్రులు, ఎంపీలకు బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం నుంచి ప్రాజెక్టులు, నిధులు సాధించేందుకు ఎంపీలు చురుకుగా వ్యవహరించాలని తెలుగుదేశం అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి కేంద్ర మంత్రులతో సమన్వయం అవసరమని తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించి కేంద్రం నుంచి ప్రాజెక్టులు, నిధులు, పథకాలు సాధించడంలో ఎంపీలు కీలకంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. రానున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన విధివిధానాలపై శనివారం తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంలోని ఆయా శాఖల వ్యవహారాలపై కేంద్ర మంత్రులు, మంత్రిత్వ శాఖలతో సంప్రదింపులు జరిపే బాధ్యత ఎంపీలకు అప్పగించారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కేంద్రంతో నిరంతర సంప్రదింపులకు శాఖల వారీగా బాధ్యతలు అప్పగించారు. ఇటు రాష్ట్ర మంత్రులు, అటు కేంద్ర మంత్రులు సమన్వయంతో పనిచేసి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు సాధించేలా ప్రణాళిక రూపొందించారు. 

ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ఏమన్నారంటే... 

‘‘ప్రజలు మనపై అనేక ఆశలు పెట్టుకున్నారు. తిరుగులేని మెజారిటీలతో గెలిపించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలి. అభివృద్ధి సంక్షేమం చేసి చూపించాలి. ఇప్పటికే 5 హామీలపై నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం. ఎంపీలకు శాఖలు అప్పగించాం. ప్రతి మూడు నెలలకు ఒకసారి పనితీరుపై సమీక్షిస్తా. ఎన్ని నిధులు తెచ్చారు. కేంద్రం నుంచి రావాల్సిన ప్రాజెక్టులు, అనుమతుల విషయంలో మీ పనితీరును సమీక్షిస్తాం. అమరావతి, పోలవరం, జల్ జీవన్ మిషన్ వంటి ప్రాజెక్టుల కోసం కేంద్రం నుంచి నిధులు రాబట్టాలి. విభజన చట్టంలో ఉన్న హామీలను అమలు జరిగేలా చూడాలి. విభజన చట్టంలోని షెడ్యూల్ 9,10లో ఉన్న ఆస్తుల పంపకాన్ని పూర్తి చేయాలి. ఇప్పటికే దీనిపై తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు మొదలు పెట్టాం.’’

‘‘కేంద్రం మంజూరు చేసిన ప్రాజెక్టులన్నీ 2014 నుంచి 2019 వరకు వేగంగా పూర్తయ్యాయి. కానీ, జగన్ అన్నింటినీ రివర్స్ చేశాడు. నాడు మంజూరు చేసిన పెట్రోలియం యూనివర్సిటీని విశాఖలో ఏర్పాటు చేయాలి. అవసరం అయిన నిధులు తెచ్చి కార్యకలాపాలు ప్రారంభించాలి. కడప ఉక్కు పైనా కేంద్రంతో చర్చలు జరపాల్సి ఉంది. విశాఖ స్టీల్ విషయంలో తప్పుడు ప్రచారాలకు చెక్ పెట్టాలి. ప్లాంటును సమర్థవంతంగా నడిపేందుకు చర్యలు తీసుకునేలా కేంద్రంతో మాట్లాడాలి. రాష్ట్ర ప్రభుత్వం తరపున మైన్స్ ను కేటాయించే అంశాన్ని పరిశీలించాలి.’’

‘‘రాజధాని అమరావతితో పాటు వెనుకబడిన జిల్లాల అభివృద్దికి నిధులు తేవాలి. ప్రకాశం జిల్లాకు కూడా వెనుకబడిన జిల్లా కింద నిధులు తేవాలి. వెనుకబడిన జిల్లాలకు మైక్రో ఇరిగేషన్ కింద 90 శాతం సబ్సిడీని కేంద్రం నుంచి సాధించాలి. ఈ ప్రాంతాల్లో పారిశ్రామిక రాయితీలు కూడా సాధించాలి.’’

‘‘విశాఖలో రైల్వే జోన్‌కు అవసరమైన భూములు వెంటనే కేటాయించే ప్రక్రియపూర్తి చేయాలి. నడికుడి- కాళహస్తి రైల్వే లైన్ పనులు వేగవంతం చేయాలి. భూసేకరణ సమస్యను పరిష్కరించాలి. కోటిపల్లి- నర్సాపురం రైల్వే ప్రాజెక్టుకు భూ సేకరణ జరగలేదు. దీన్ని కేంద్రంతో మాట్లాడి ముందుకు తీసుకువెళ్లాలి.’’ 

‘‘నేషనల్ హైవేస్ పైనా ఎంపీలు ఫోకస్ పెట్టాలి. అమరావతి– అనంతపురం, రాజధాని ఔటర్ రింగ్ రోడ్డ్ ప్రాజెక్టులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలి. ట్రైబల్ యూనివర్సిటీ కొత్తవలసలోనే ఏర్పాటవుతుంది. ఎప్పుడో పూర్తి కావాల్సిన ఈ ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఒకే గొడుగు కింద హైవేలు, పోర్టులు, విమానాశ్రయాలు, పారిశ్రామిక పార్కులు తీసుకురావాలి. ప్రతి నిముషం, ప్రతి రోజూ ముఖ్యమే అనేలా ఎంపీలు పనిచేయాలి. ఆ స్థాయిలో మీరు చొరవ చూపితే రాష్ట్రానికి అంత త్వరగా మంచి జరుగుతుంది.’’

PREV
Read more Articles on
click me!

Recommended Stories

RK Roja Comments on TTD Chairman BR Naidu బీఆర్ నాయుడుపై ఓ రేంజ్ లో రెచ్చిపోయిన రోజా| Asianet Telugu
Tirumala Temple Reopens After Lunar Eclipse: చంద్రగ్రహణం అనంతరం తెరుచుకున్న తిరుమల | Asianet Telugu