జగన్ మాట తప్పారు, పచ్చి మోసం: చంద్రబాబు ధ్వజం

By telugu teamFirst Published May 21, 2020, 11:14 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుచ్ఛక్తి చార్జీల పెంపును టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా వ్యతిరేకించారు. చార్జీలు పెంచబోమని అధికారంలోకి వచ్చిన జగన్ ఆ తర్వాత మాట తప్పారని అన్నారు.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యుత్తు చార్జీలను పెంచడాన్ని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధినేత, ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ట్విట్టర్ వేదికగా ఆయన స్పందించారు. చార్జీలు పెంచబోమని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పారని ఆయన అన్నారు. 

"అసలే లాక్ డౌన్ వలన పనుల్లేక పేదలు, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా కష్టాలు పడుతుంటే... ప్రభుత్వం గుట్టు చప్పుడు కాకుండా కరెంటు శ్లాబులు మార్చి, చార్జీలు పెంచి వాళ్ళ మీద బిల్లుల భారం మోపడం అన్యాయం. విద్యుత్ చార్జీలు పెంచేది లేదని చెప్పి అధికారంలోకి వచ్చాక ఇలా చేయడం మోసం" అని ఆయన అన్నారు. 

"లాక్ డౌన్ నేపథ్యంలో 3 నెలల విద్యుత్ బిల్లులు రద్దుచేయాలి. ఆ తర్వాత కూడా పాత శ్లాబు విధానంలో చార్జీలు వసూలు చేయాలి. కరెంటు చార్జీల పెంపునకు నిరసనగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా చేస్తున్న నిరసనలకు ప్రజలు మద్దతు తెలపాలి" అని ఆయన అన్నారు.

click me!