జగన్ నిర్ణయాన్ని తప్పుబట్టిన కేంద్రం: అర్థమయ్యేలా చెప్పాలంటూ సీఎస్ కు ఆదేశం

By Nagaraju penumalaFirst Published Jun 8, 2019, 6:02 PM IST
Highlights

విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై పున:పరిశీలన చేయడం పారిశ్రామిక అభివృద్ధికి మంచిది కాదని హితవు పలికింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో చేసుకున్న వివిధ ఒప్పందాలు పారదర్శకంగా జరిగాయని అలాంటి వాటిపై పున: పరిశీలన దేశ పారిశ్రామిక అభివృద్ధిని దెబ్బతీస్తుందన్నారు. 

విజయవాడ: విద్యుత్ ఒప్పందాలను అవసరమైతే రద్దు చేస్తామంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించడాన్ని కేంద్రం తప్పుబట్టింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ప్రమాణ స్వీకారం వేదిక సాక్షిగా టీడీపీ ప్రభుత్వం హయాంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలను అవసరం అయితే రద్దు చేస్తామని ప్రకటించారు. 

సీఎం జగన్ ప్రకటనపై కేంద్ర ఇంధన శాఖ స్పందించింది. ఈ మేరకు కేంద్ర ఇంధన శాఖ కార్యదర్శి అనంద్ కుమార్ ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు లేఖ రాశారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై పున:పరిశీలన చేయడం పారిశ్రామిక అభివృద్ధికి మంచిది కాదని హితవు పలికింది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో చేసుకున్న వివిధ ఒప్పందాలు పారదర్శకంగా జరిగాయని అలాంటి వాటిపై పున: పరిశీలన దేశ పారిశ్రామిక అభివృద్ధిని దెబ్బతీస్తుందన్నారు. ఒప్పందాల పున:పరిశీలన పెట్టుబడిదారుల నమ్మకాన్ని దెబ్బతీస్తోందని, వారు పెట్టుబడులు పెట్టేందుకు భయపడేలా చేస్తుందని లేఖలో పేర్కొన్నారు. 

రాష్ట్ర దేశ భవిష్యత్ కు ఇది మంచిది కాదని లేఖలో స్పష్టం చేశారు. ఒప్పందాల్లో ఏదైనా కుట్ర జరిగినా ఎవరికైనా లబ్ధి చేకూరిందని రుజువైతే తప్ప ఒప్పందాలను పున:పరిశీలన చేయరాదని స్పష్టం చేసింది. అలా జరగని పక్షంలో ఒప్పందాలకు కట్టుబడి ఉండాలని తెలిపింది. 

రాష్ట్ర ప్రభుత్వం చేసుకునే ఒప్పందాలు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరి కమిషన్ నిబంధనల ప్రకారమే జరుగుతాయని లేఖలో పేర్కొంది. అదికూడా బహిరంగ వేళం ప్రక్రియలో సాగుతాయని స్పష్టం చేసింది. 2022 నాటికి 175 గిగా వాట్ల పునరుత్పాధక శక్తి సాధించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేసింది. 

అలాంటి తరుణంలో ఏపీ విద్యుత్ కొనుగోలుపై పున:పరిశీలన జరపడం సరికాదని స్పష్టం చేసింది. వీటన్నింటిపై వాస్తవాలు అర్థమయ్యేలా ముఖ్యమంత్రికి వివరించాలని సీఎల్ ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని లేఖలో సూచించింది. 

click me!