
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడిపై (Chintakayala Ayyanna Patrudu) మరో కేసు నమోదైంది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వైసీపీ నేత రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అయ్యన్నపాత్రుడిపై కేసు నమోదు చేశారు. సీఎం జగన్ను అయ్యన్నపాత్రుడు అసభ్య పదజాలంతో దూషించారంటూ రామకృష్ణ నల్లజర్ల పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. నల్లజర్లలో నిర్వహించిన ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సభలో అయ్యనపాత్రుడు మాట్లాడుతూ సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని రామకృష్ణ ఫిర్యాదులో తెలిపారు. రామకృష్ణ ఫిర్యాదును స్వీకరించిన నల్లజర్ల పోలీసులు.. అయ్యన్నపాత్రుడిపై ఐపీసీలోని 153A, 505(2), 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
ఇక, శుక్రవారం నల్లజర్లలో ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని అయ్యన్నపాత్రుడు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ పాలనలో అంతా దోపిడి మాత్రమే జరుగుతుందని ఆరోపించారు. భారతి సిమెంట్ ధర తెలంగాణలో కంటే ఏపీలో ఎక్కువగా ఉందన్నారు. చెత్తపై పన్ను వేసిన సీఎం జగన్ మాత్రమేనని మండిపడ్డారు. ఇసుకలో రూ. వేల కోట్ల దోపిడి జరుగుతుందని ఆరోపించారు. టీడీపీ నేతలపై ఎన్ని కేసులు పెట్టుకున్నా వెనక్కు తగ్గేది లేదన్నారు. రాష్ట్రంలో పోలీసులు అతిగా వ్యవహరిస్తున్నారన్నారు.
గతంలోను అయ్యన్నపాత్రుడిపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దివంగత మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ స్వగ్రామంలో ఆయన విగ్రహావిష్కరణ సభలో అయ్యన్న పాత్రుడు చేసినకు సంబంధించి న్యాయవాది వేముల ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరండల్పేట పోలీసులు ఎష్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. దళిత మంత్రి మేకతోటి సుచరితను, సీఎం వైఎస్ జగన్ను అసభ్య పదజాలంతో దూషిస్తూ బహిరంగంగా సమావేశంలో మాట్లాడినందున అయ్యన్నపాత్రుడిపై చర్యలు తీసుకోవాలని వేముల ప్రసాద్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
వేముల ప్రసాద్ ఫిర్యాదు మేరకు.. అయ్యన్నపాత్రుడిపై సెక్షన్ 505(2), మహిళను కించపరిచేలా మాట్లాడినందుకు సెక్షన్ 509, సీఎంను దూషించినందుకు సెక్షన్ 294(బి)తోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు.