
కర్నూల్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు పెట్టుకొనే ప్రసక్తే లేదని బీజేపీ ఏపీ రాష్ట్ర ఇంచార్జీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ థియోధర్ కుండబద్దలు కొట్టారు.
గురువారం నాడు సునీల్ థియోదర్ కర్నూల్ జిల్లాలో మీడియాతో మాట్లాడారు. ఏపీలో టీడీపీకి డోర్లు మూసివేశామని ఆయన తేల్చి చెప్పారు.ఇది సునీల్ థియోదర్ చెప్పిన మాట కాదన్నారు.
ప్రధానమంత్రి మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాలే తనకు ఈ విషయాన్ని చెప్పారని ఆయన వివరించారు. ఓ మంచి లక్ష్యంతో తెలుగుదేశం పార్టీని నందమూరి తారక రామారావు స్థాపించాడని ఆ లక్ష్యానికి చంద్రబాబు నాయుడు తూట్లు పొడిచారని ఆయన విమర్శించారు.
దివంగత ఎన్టీఆర్ బాహుబలి అయితే చంద్రబాబు నాయుడు కట్టప్ప మాదిరి వెన్నుపోటు పొడిచిన నేత అంటూ సునీల్ థియోధర్ ఎద్దేవా చేశారు. భారతీయ జనతా పార్టీ ఇటు జనసేనతో కానీ అటు వైసిపితో పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
గత ఎన్నికలకు ముందు టీడీపీ బీజేపీతో పొత్తును తెగతెంపులు చేసుకొంది. ఒంటరిగా టీడీపీ పోటీ చేసింది. బీజేపీతో తెగదెంపులు చేసుకోవడం రాజకీయంగా తమకు నష్టం చేసిందని సమీక్ష సమావేశంలో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు వ్యాఖ్యలు చేశారు.
బీజేపీతో పొత్తు కొనసాగి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ తరుణంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీతో టీడీపీ జత కట్టే అవకాశాలు లేకపోలేదని మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఓ మీడియా ఛానెల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రకటించారు.
ఈ వ్యాఖ్యల నేపథ్యంలో గురువారం నాడు బీజేపీ ఏపీ ఇంచార్జీ సునీల్ థియోదర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాష్ట్రంలో బీజేపీ టీడీపీ జతకట్టే అవకాశం లేదని తేల్చి చెప్పారు.
వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ బలోపేతం కానుందని ఆయన చెప్పారు. ఈ మేరకు తమ పార్టీ అన్ని కాల ప్రయత్నాలు చేస్తున్నామని ఆయన తేల్చి చెప్పారు2014 ఎన్నికల్లో ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లో టీడీపీ, బీజేపీలు కలిసి పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో ఏపీ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఏపీ ప్రభుత్వంలో బీజేపీ కూడ భాగస్వామ్యమైంది.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వంలో టీడీపీ భాగం పంచుకొంది. టీడీపీకి చెందిన ఇద్దరికి ఆ సమయంలో బీజేపీ రెండు మంత్రి పదవులు దక్కాయి. ఏపీ రాష్ట్రంలో బీజేపీకి చెందిన ఇద్దరికి రెండు మంత్రి పదవులను టీడీపీ కేటాయించింది.