ఎన్నికలంటేనే బెంబేలెత్తిపోతున్న చంద్రబాబు:బీజేపీ ఎంపీ జీవీఎల్

Published : Sep 06, 2018, 02:36 PM ISTUpdated : Sep 09, 2018, 02:10 PM IST
ఎన్నికలంటేనే బెంబేలెత్తిపోతున్న చంద్రబాబు:బీజేపీ ఎంపీ జీవీఎల్

సారాంశం

ఎన్నికలు అంటేనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బెంబేలెత్తిపోతున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తుంటే అసలు చంద్రబాబు ఎన్నికలంటేనే హడలిపోతున్నారని విమర్శించారు. 

విజయవాడ: ఎన్నికలు అంటేనే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బెంబేలెత్తిపోతున్నారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్తుంటే అసలు చంద్రబాబు ఎన్నికలంటేనే హడలిపోతున్నారని విమర్శించారు. ఓటమి భయంతో టీడీపీ తీవ్ర ఒత్తిడిలో ఉందని, చంద్రబాబుకు ఈసారి అధికారం మూడు నాళ్ల ముచ్చటేనని ఎద్దేవా చేశారు. అమరావతిలో కనీసం శాశ్వత అసెంబ్లీ, సెక్రటేరియట్‌ నిర్మించలేని చంద్రబాబు ఒలంపిక్స్‌ నిర్వహిస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 

రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని, మంత్రులు, ఎమ్మెల్యేల అవినీతిని చూసి అధికారులు కూడా అవినీతిపరులుగా మారారని ఆరోపించారు. అవినీతికి చట్టబద్ధత తెచ్చిన ఘనుడు చంద్రబాబేనని మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకీ రాకపోవడానికి కారణం టీడీపీ అనుసరిస్తున్న విధానాలే కారణమని జీవీఎల్ ఆరోపించారు. 

ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి వాళ్లలో నలుగురికి మంత్రి పదవులు ఇవ్వడం అంటే ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమేనని విమర్శించారు. చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తుంటే స్పీకర్‌ మాత్రం చోద్యం చూస్తున్నారని..ఈ సమావేశాల్లోనైనా అమ్ముడుపోయిన ఎమ్మెల్యేలపై స్పీకర్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 


మరోవైపు ఏపీలో అవినీతి రాజ్యమేలుతుందని మండిపడ్డారు. ఏపీ ఫిషరీష్‌ ద్వారా వేల కోట్ల రూపాయల నిధులను దారి మళ్లించారని వాటి వివరాలు బహిర్గతం చెయ్యాలని కోరారు. అమరావతి బాండ్ల ఇన్వెస్టర్ల పేర్లు ప్రభుత్వం ఎందుకు బహిర్గతం చేయడం లేదో చెప్పాలని ప్రశ్నించారు.

అలాగే చంద్రబాబు అప్పులు చెయ్యడంలోనూ నెంబర్ వన్ అని నిరూపించుకున్నారన్నారు. ఆ అప్పుల్లో కూడా అవినీతికి పాల్పడ్డ వ్యక్తి చంద్రబాబేనని ధ్వజమెత్తారు. అమరావతి రాజధాని నిర్మాణంలో హెరిటేజ్‌ భూములు పోకుండా చేశారని ఎద్దేవా చేశారు. ఎన్నికల ఫండ్‌ కోసం అమరావతిని బాబు వాడుకుంటున్నారని ఘాటుగా విమర్శించారు. 

అవినీతికి పాల్పడిన వారి పేర్లు త్వరలోనే బయటపెడతామని స్పష్టం చేశారు. ప్రజల మధ్యలో టీడీపీ ఎమ్మెల్యేలు దళారీలుగా ఉన్నారని, ప్రతి నియోజకవర్గంలో కాంట్రాక్టు పనుల కోసం టీడీపీ ఎమ్మెల్యేలకు 10 శాతం వాటా ఇవ్వాల్సిన పరిస్థితి ఏపీలో నెలకొందన్నారు. చంద్రబాబు వల్ల ఎన్టీఆర్‌ రాజకీయ బాధితుడిగా మారాడని వ్యాఖ్యానించారు.

PREV
click me!

Recommended Stories

మీ ఇంట్లో ఇలాంటి భోజనం తింటారా.? Food Commission Chairman Inspection In MJPAPBCW Residential School
He is true Hero! మైనారిటీల కోసం అలుపెరగని పోరాటం | Dr Masthan Basha about Abdul Azeez | Asianet News