చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు..? బీజేపీ నేతలు

By ramya neerukondaFirst Published Aug 23, 2018, 12:03 PM IST
Highlights

పీడీ అకౌంట్లపై చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణకు సిద్ధపడాలని సవాల్‌ విసిరారు. పీడీ అకౌంట్లలో జరిగిన అవినీతిని కాగ్‌ తప్పు పట్టిందని తెలిపారు. అభివృద్ధి కోసం అమరావతి బాండ్ల పేరుతో  అప్పులు తేలేదని, అవినీతి కోసమే అప్పులు తెచ్చారని విమర్శించారు. 

ఏ తప్పు చేయకపోతే చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారని బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు ప్రశ్నించారు. గురువారం బీజేపీ సీనియర్ నేతలు జీవీఎల్ నరసింహారావు, సోము వీర్రాజు, విష్ణువర్ధన్‌రెడ్డి లు గవర్నర్ నరసింహన్ ను కలిశారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వ అవినీతిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు.

అనంతరం జీవీఎల్ నరసింహారావు మీడియాతో మాట్లాడుతూ..పీడీ అకౌంట్లపై సీబీఐ విచారణ జరిపించాలని గవర్నర్‌ను కోరామని తెలిపారు. దీనిపై ఇప్పటికే నివేదిక తెప్పించుకున్నానని గవర్నర్‌ చెప్పారని అన్నారు. ఇంకా అదనంగా సమాచారం ఉంటే ఇవ్వాలని గవర్నర్‌ అడిగారు..ఏ రాష్ట్రంలో లేని విధంగా పీడీ అకౌంట్లు ఏపీలో తెరిచి రూ.53 వేల కోట్లు దుర్వినియోగం చేశారని వెల్లడించారు. 

పీడీ అకౌంట్ల విషయంలో ప్రభుత్వ అవినీతి వెలికి తీసేవరకు వదిలిపెట్టమని హెచ్చరించారు. పీడీ అకౌంట్లపై ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడితో సహా అందరూ అబద్ధాలు చెబుతున్నారని వ్యాఖ్యానించారు. పీడీ అకౌంట్లపై చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణకు సిద్ధపడాలని సవాల్‌ విసిరారు. పీడీ అకౌంట్లలో జరిగిన అవినీతిని కాగ్‌ తప్పు పట్టిందని తెలిపారు. అభివృద్ధి కోసం అమరావతి బాండ్ల పేరుతో  అప్పులు తేలేదని, అవినీతి కోసమే అప్పులు తెచ్చారని విమర్శించారు. ఎక్కువ అప్పులు తెచ్చి ఎక్కువ దోచుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు.

సోము వీర్రాజు మాట్లాడుతూ..భోగాపురం ఎయిర్‌పోర్టు టెండర్లను రద్దు చేసి ప్రభుత్వం కొత్త కుంభకోణానికి తెరతీస్తోందని విమర్శించారు. భోగాపురం ఎయిర్‌పోర్టును ప్రభుత్వరంగ సంస్థ ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా కట్టడానికి ముందుకు వస్తే ఎందుకు టెండర్లు రద్దు చేసుకున్నారు..ఎయిర్‌పోర్టును ప్రైవేటు సంస్థలకు ఎందుకు కట్టబెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు..టెండర్లలో ప్రభుత్వరంగ సంస్థలు ఎందుకు పాల్గొనరాదని ఆంక్షలు పెడుతున్నారని ప్రశ్నలు సంధించారు. టెండర్ల రద్దుపై కోర్టులను ఆశ్రయిస్తాము..రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా పెరిగిపోయిందని వ్యాఖ్యానించారు. ముడుపుల కోసమే ఎయిర్‌పోర్టును ప్రైవేటు రంగ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 

click me!