
తెలుగుదేశం పార్టీ నేత ఏవీ సుబ్బారెడ్డిపై కేసు నమోదైంది. మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ చున్నీ పట్టుకొని లాగినట్లు ఏవీ సుబ్బారెడ్డిపై ఫిర్యాదు రావడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అఖిలప్రియ ఈ ఫిర్యాదు చేశారు. ఏవీ సుబ్బారెడ్డి తన చున్నీ పట్టుకొని లాగి చంపడానికి ప్రయత్నించారని ఫిర్యాదులో ఆరోపించారు. ఈ మేరకు ఎన్టీవీ రిపోర్ట్ చేసింది.
ఇదిలా ఉంటే.. నంద్యాల జిల్లాలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువ గళం పాదయాత్ర సందర్భంగా కొత్తపల్లిలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. ఏవీ సుబ్బారెడ్డి, అఖిలప్రియ వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘర్షణలో సుబ్బారెడ్డి చొక్కా చిరిగిపోయింది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. సుబ్బారెడ్డి కారులో ఎక్కించి అక్కడి నుంచి ఆస్పత్రికి తరలించారు.
ఏవీ సుబ్బారెడ్డిపై దాడి జరిగిన ఘటనలో అఖిలప్రియతోపాటు ఆమె అనుచరులపై హత్యయత్నం కేసులు నమోదుయ్యాయి. ఈ క్రమంలోనే అఖిలప్రియ పీఏ మోహన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. ఆనంతరం బుధవారం ఉదయాన్నే అఖిలప్రియ ఇంటికి వెళ్లిన నంద్యాల పోలీసులు.. ఆమెను అరెస్ట్ చేశారు. అనంతరం ఆళ్లగడ్డ నుంచి నంద్యాలకు తరలించారు. మరోవైపు నంద్యాల్లో ఏవీ సుబ్బారెడ్డి ఇంటి దగ్గర బందోబస్తు ఏర్పాటు చేశారు.