మరో హిందూ దేవాలయంపై దాడి... దేవతా విగ్రహాలు ధ్వంసం

By Arun Kumar PFirst Published Sep 22, 2020, 11:36 AM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ లో హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి.

మాచర్ల: ఆంధ్ర ప్రదేశ్ లో హిందూ దేవాలయాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా గుంటూరు జిల్లా వెల్దుర్తిలోని ఓ హిందూ దేవాలయంలోని విగ్రహాలు ధ్వంసం చేశారు. అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు విగ్రహాలను ధ్వంసం చేసినట్లు గుర్తించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.   

విషయం తెలుసుకున్న గురజాల డీఎస్పీ స్థానిక పోలీసులతో కలిసి ఆలయాన్ని పరిశీలించారు. గ్రామానికి ఆలయం దూరంగా ఉండటంతో ఆవులు, గేదెలు గుడిలోకి ప్రవేశించి విగ్రహాలు ధ్వంసం చేసి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై విచారణ జరిపి త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ స్పష్టం చేశారు.

అంతర్వేది ఘటన మొదలు ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతిరోజూ ఏదో ఒకచోట హిందూ దేవాలయాలు, దేవతా విగ్రహాలపై దాడులు జరుగుతూనే వున్నాయి. సోమవారం కర్నూల్ జిల్లాలో కూడా అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఆళ్లగడ్డ మండలం చిన్న కందుకూరులోని శ్రీ భైరవ స్వామి గుడిలో కాలభైరవ స్వామి విగ్రహాన్ని ఎవరో గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. 

read more   అంతర్వేది ఘటన ఆ మతాల కుట్రేనని అనుమానం: బిజెపి ప్రధాన కార్యదర్శి సంచలనం (వీడియో)

ఇటీవల కృష్ణా జిల్లాలో ఓ పురాతన దేవాలయంలోని నంది విగ్రహాన్ని అర్థరాత్రి గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలంలో శివాలయం దగ్గరలో గల శ్రీ సీతారామాంజనేయ వ్యాయామ కళాశాల వద్ద ఆంజనేయ స్వామి విగ్రహం చేయిని గుర్తు తెలియని దుండగులు విరగ్గొట్టారు. దీంతో హనుమాన్ భక్తులు ఆందోళనకు దిగారు. హనుమాన్ చెయి విరగగొట్టడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.  

 అంతర్వేదిలో ఘటనను ఇంకా పూర్తి స్థాయిలో మరువక ముందే ఇలాంటి వరుస సంఘటనలు భక్తులను కలవరానికి గురిచేస్తున్నాయి. విజయవాడ రూరల్ మండలం నిడమానూరులోని ఓ ఆలయంలో సాయిబాబా విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. షిర్డీ సాయిబాబా మందిరం వద్ద బయట వైపు నెలకొల్పిన బాబా విగ్రహాన్ని మంగళవారం అర్ధరాత్రి దుండగులు ధ్వంసం చేయగా ఉదయం స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

హిందూ ఆలయాలపై జరుగుతున్న వరుస దాడుల పట్ల భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా బిజెపి, జనసేన, టిడిపి పార్టీలు ఈ దాడులను నిరిసిస్తూ నిరసన బాట పట్టాయి. ఇలా హిందూ దేవాలయాలపై జరుగుతున్న వరుస దాడులు ఏపీ రాజకీయాలనూ వేడెక్కిస్తున్నాయి. 
 

click me!