ఆస్తుల కేసు: వైఎస్ జగన్ కోర్టు హాజరుకు అయ్యే ఖర్చు ఎంతో తెలుసా?

By telugu teamFirst Published Oct 19, 2019, 9:53 AM IST
Highlights

ఎపి సీఎం వైఎస్ జగన్ హైదరాబాదులోని సిబీఐ కోర్టుకు హాజరైతే ప్రతి శుక్రవారం ప్రభుత్వంపై పడే ఆర్థిక భారం గురించి ఆయన తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఎపీ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జగన్ కు మినహాయింపు ఇవ్వాలని కోరారు.

హైదరాబాద్: ఆస్తుల కేసులో ప్రతి శుక్రవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాదులోని కోర్టుకు హాజరైతే ఒక్క రోజుకు అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? ఆ ఖర్చు వివరాలను వైఎస్ జగన్ తరఫు న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి చెప్పారు. ఆ ఖర్చును, ఎపి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని జగన్ కు హాజరుకు మినహాయింపు ఇవ్వాలని ఆయన కోర్టును కోరారు. 

సిఎం హోదాలో ఉన్న వైఎస్ జగన్ ఒక రోజు సిబిఐ కోర్టుకు హాజరైతే సెక్యూరిటీ, ప్రోటోకాల్, ఇతర ఖర్చులన్నీ కలిపి రూ. 60 లక్షల దాకా అవుతుందని నిరంజన్ రెడ్డి చెప్పారు. హైదరాబాదు కోర్టుకు హాజరైనప్పుడు ఇక్కడి పోలీసులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉందని, ఈ పరిస్థితిలో జగన్ కోర్టుకు హాజరు కావడం వల్ల రాష్ట్ర ఖజానాపై ఆర్థిక భారం పడుతుందని ఆయన చెప్పారు. 

అసౌకర్యంగా ఉందనే కారణంతో మినహాయింపును కోరడం లేదని, సిఎంగా పరిపాలనను పర్యవేక్షించాల్సిన రాజ్యాంగబద్దమైన బాధ్యత ఉన్నందున హాజరుకు మినహాయింపు కోరుతున్నామని ఆయన అన్నారు. కాగా, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ వైఎస్ జగన్ ప్రతి శుక్రవారం ప్రత్యేక కోర్టుకు హాజరు కావాల్సిందేనని సిబిఐ వాదించింది. 

జగన్ ప్రస్తుతం ఎపి ముఖ్యమంత్రిగా తీరిక లేకుండా ఉన్నందున తనకు బదులుగా న్యాయవాది (స్పెషల్ వకాలత్) కోర్టు విచారణకు హాజరయ్యేందుకు అనుమతించాలని కోరుతూ సిఆర్పీపీసి సెక్షన్ 205 కింద దాఖలు చేసిన పిటిషన్ పై న్యాయమూర్ిత బీఆర్ మధుసూదనరావు శుక్రవారం మరోసారి విచారణ జరిపారు. 

సిఎంగా ఉన్నప్పటికీ వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరడాన్ని చట్టం అనుమతించదని, గతంలో కోర్టులు ఇటువంటి అభ్యర్థనలను తోసిపుచ్చాయని సిబిఐ స్పెషల్ పీపీ కె. సురేందర్ రావు కోర్టుకు తెలిపారు. ఎంపీగా, ప్రతిపక్ష ేతగా ఉన్న కారణంగా వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జగన్ వేసిన పిటిషన్లను ఇదే కోర్టు రెండు సార్లు కొట్టేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ జగన్ హైకోర్టును అశ్రయించినా సిబిఐ కోర్టు తీర్పునే సమర్థించిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. 

జగన్ హోదా మారి ఉండవచ్చు గానీ కేసు విచారణలో పురోగతి అక్కడే ఉందని, విచారణకు జగన్ తప్పనిసరిగా హాజరు కావాలని ఆయన అన్నారు. జగన్ పై ఉన్నవి ఆర్థిక నేరాలకు సంబంధించిన తీవ్రమైన అభియోగాలని, ఇటువంటి కేసుల్లో నిందితుల వ్యక్తిగత హజారుకు మినహాయింపు ఇవ్వడం సరి కాదని అన్నారు. హైకోర్టు జగన్ పిటిషన్ ను ఒక్కసారి కొట్టేసిన తర్వాత దాని విచారణ పరిధి సిబిఐ కోర్టుకు ఉండదని, కావాలంటే జగన్ సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సిందేనని అన్ారు. 

వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇస్తే కేసు విచారణకు జరిగే నష్టమేమీ లేదని, గత ఆరేళ్లుగా ఎప్పుడు కూడా కోర్టు విచారణను అడ్డుకునే ప్రయత్నం చేయలేదని, పాదయాత్ర చేస్తు్న సమయంలో హాజరు మినహాయింపు కోరినా రాజకీయావసరాల కోసం మినహాయింపు ఇవ్వలేమని స్పష్టం చేశారని జగన్ తరఫున న్యాయవాది అన్నారు. విచారణను న్యాయమూర్తి నవంబర్ 1వ తేదీకి వాయిదా వేశారు.

click me!