ఎపిలో కొత్త బిల్డింగ్ ల మీద గ్రీన్ టాక్స్

Published : Nov 22, 2016, 12:25 PM ISTUpdated : Mar 25, 2018, 11:55 PM IST
ఎపిలో కొత్త బిల్డింగ్ ల మీద గ్రీన్ టాక్స్

సారాంశం

అయిదు వేల చదరపు అడుగుల మించి నిర్మించే బిల్డింగుల మీద గ్రీన్ టాక్స్ వేయాలని  ముఖ్యమంత్రి నాయుడు  నిర్ణయించారు.

ఆర్థిక వనరులను పెంచుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  బిల్డింగుల నుంచి గ్రీన్ టాక్స్ వసూలు చేయాలని నిర్ణయించింది.  ఇక ముందు రాష్ట్రంలో అయిదు వేల చదరపు అడుగుల వైశాల్యం  మించి నిర్మించే భవనాల మీద ఈ పన్ను పడుతుంది.  చదరపు అడుగుకు రు. 3 చొప్పున ఈ టాక్స్ వసూలు చేయాలని ఈ రోజు గనుల శాఖ మీద జరిగిన సమీక్ష సమావేేశంలో నిర్ణయించారు.

 

ఇదే విధంగా మైనింగ్ కోసం లీజుకు తీసుకున్న క్వారీలను వేరొకరికి బదిలీ చేయడాన్ని రద్దు చేస్తూ  రాష్ట్ర ప్రభత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మైనింగ్ లీజుల బదిలీలతో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అనుబంధ పరిశ్రమలు వున్న క్వారీలను మాత్రమే బదలాయించుకునేందుకే అనుమతివ్వాలని నిర్ణయించారు.  ప్రస్తుతం 20 ఏళ్లుగా వున్న మైనింగ్ లీజు కాలాన్ని అనుబంధ పరిశ్రమలు పెడితే 30 ఏళ్లకు పెంచాలని సూచించారు. 

 

చిత్తూరు జిల్లా చిగురుకుంటలో బంగారుపంట పండనుంది. ఇక్కడ బంగారం వనరులు లభిస్తున్నాయని జియోలాజికల్ డేటా తేటతెల్లం చేయడంతో వేలం వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వచ్చే ఏడాది జనవరిలో వేలం వేస్తారు.

 

మంగళవారం విజయవాడలోని  గనుల శాఖపై నిర్వహించిన సమీక్షలో   ముఖ్యమంత్రి ఈ నిర్ణయాలు తీసుకున్నారు.

 

ఈ సమావేశంలో సిరామిక్, గాజు పరిశ్రమల అభివృద్ధికి రాష్ట్రంలో మరో రెండు పారిశ్రామిక క్లస్టర్ల ఏర్పాటుకు అంగీకారం తెలిపారు. దీంతో సిరామిక్, గాజు పరిశ్రమల అభివృద్ధికి చిత్తూరు జిల్లాలో సిరామిక్ క్లస్టర్, ఓర్వకల్లులో గ్లాస్-సిలికా క్లస్టర్‌ ఏర్పాటు కానుంది. అలాగే కృష్ణాజిల్లా మల్లవల్లిలోనూ సిరామిక్ క్లస్టర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు ముఖ్యమంత్రి చెప్పారు.   

 

గ్రానైట్ మైనింగ్ సీనరేజ్, డీఎంఎఫ్ (డిస్ట్రిక్ మినరల్ ఫౌండేషన్) రాయల్టీలు భారంగా మారాయని ఇటీవల గనుల శాఖకు విజ్ఞాపనలు రావడంతో, పొరుగు రాష్ట్రాల్లో ఎంతమేర వసూలు చేస్తున్నారో అధ్యయనం చేసి, నివేదిక ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

PREV
click me!

Recommended Stories

Minister Savitha రక్తం ఏరులై పారించిన చరిత్ర నీది జగన్ పై మంత్రి సవిత ఆగ్రహం.. | Asianet News Telugu
Chandrababu Naidu: సంజీవిని పని తీరు అడిగితెలుసుకున్న సీఎం చంద్రబాబు| Asianet News Telugu