టిడిపి అభ్యర్థి భర్తపై వైసిపి నాయకులు కత్తులతో దాడి: ఈసికి అచ్చెన్నాయుడు ఫిర్యాదు

By Arun Kumar PFirst Published Nov 24, 2020, 10:22 AM IST
Highlights

స్థానిక సంస్థల ఎన్నికలను ప్రజాక్షేత్రంలో ఎదుర్కొలేక టీడీపీ అభ్యర్ధులను బెదిరింపులకు దిగుతూ దాడులకు పాల్పడుతున్నారని ఆ పార్టీ ఏపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఈసికి ఫిర్యాదు చేశారు. 

గుంటూరు: ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలపై అధికార అండతో వైసీపీ నేతలు ఇష్టానుసారంగా దాడులకు పాల్పడుతున్నారంటూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఫిర్యాదుచేశారు. ఇటీవల కాలంలో ఈ దాడులు మరీ ఎక్కువయ్యాయని అన్నారు. తాజాగా సంతమాగులూరు మండలం కుందూరులో వైసీపీ శ్రేణులు కత్తులతో టీడీపీ అభ్యర్ధులపై దాడులకు పాల్పడిన ఘటనను వివరిస్తూ అచ్చెన్నాయుడు కమీషనర్ కు లేఖ రాశారు. 

''స్థానిక సంస్థల ఎన్నికలను ప్రజాక్షేత్రంలో ఎదుర్కొలేక టీడీపీ అభ్యర్ధులను బెదిరింపులకు దిగుతున్నారు. అందులో భాగంగానే కుందూరు ఎంపీటీసీ అభ్యర్ధి రాఘవమ్మ భర్తపై హత్యాయత్నం చేశారు.  స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీ అభ్యర్ధులే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు దాడులకు బరితెగిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వైసీపీ నేతలు సృష్టించిన వీరంగంపై సీబీఐ విచారణ జరిపించాలి'' అని ఈసీ దృష్టికి తీసుకెళ్లారు.

''వైసిపి నాయకులు దాడులు, దౌర్జన్యాలకు పాల్పడిన ప్రాంతాల్లో ఎన్నికలు వాయిదా వేయాలి. ప్రతిపక్ష అభ్యర్ధులకు కేంద్ర భద్రతా దళాలతో రక్షణ కల్పించాలి. ఆన్ లైన్ లో నామినేషన్ ప్రక్రియ చేపట్టేందుకు ఏర్పాట్లు చేయాలి. కేంద్ర భద్రతా దళాల సహకారంతో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలి'' అని కోరారు. 

''రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు అప్రజాస్వామిక, అనైతిక విధానాలకు పాలపడుతున్నారు. హత్యా రాజకీయాలతో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. వైసీపీ నేతలు అనుసరిస్తున్న విధానాలతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది'' అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. 
 

click me!