
AP NEWS: అధికార వైఎస్సార్సీపీ ఎదురుదెబ్బ తగిలింది. తంబళ్లపల్లి నియోజకవర్గానికి చెందిన వైఎస్సార్సీపీ నేత.. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేను నిలదీయడంతో పార్టీ కన్నెర్ర చేసింది. అక్రమ కేసులు పెట్టి.. వేధించ సాగింది. దీంతో ఆగ్రహనికి గురై ఆ నేత .. వైసిపి అరాచక పాలనను వ్యతిరేకిస్తూ కొండ్రెడ్డి తెలుగు దేశం పార్టీ కండువా కప్పుకున్నారు.
వివరాల్లోకెళ్తే.. తంబళ్లపల్లి నియోజకవర్గానికి చెందిన వైసిపి నేత మద్దిరెడ్డి కొండ్రెడ్డి, ఆయన అనుచరులు చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరారు. ప్రస్తుతం మద్దిరెడ్డి భార్య తంబళ్ల పల్లి వైసిపి జడ్పిటిసిగా ఉన్నారు. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి పై మద్దిరెడ్డి కొండ్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి అరాచకాలు, అవినీతిలపై మద్దిరెడ్డి కొండ్రెడ్డి ప్రశ్నించారు. దీంతో అధికార పార్టీ ఆగ్రహానికి కొండ్రెడ్డి గురయ్యారు. అతనిపై అధికార పార్టీ నేతలు కేసులు పెట్టి వేధించారు. దీంతో ఆయన తెలుగు దేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి ని ఈ సారి ఎన్నికల్లో ఓడిస్తామని కొండ్రెడ్డి అన్నారు.
వచ్చే ఎన్నికల్లో పుంగనూరు, తంబళ్ల పల్లి నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ డిపాజిట్ కూడా దక్కకుండా పని చెయ్యాలని చంద్రబాబు సూచించారు. ఏపీలో దౌర్జన్యం రాజ్యం ఏలుతోందనీ, టీడీపీ అధికారంలోకి వచ్చిన తరవాత అంతే గట్టిగా సమాధానం చెపుతామని చంద్రబాబు అన్నారు. చిత్తూరు జిల్లాలో 14 సీట్లూ గెలిచేలా పార్టీని సిద్దం చెయ్యడంపై ఫోకస్ పెట్టినట్లు తెలిపారు. .
ఇటీవల కొండ్రెడ్డి.. తంబళ్లపల్లె ఎమ్మెల్యేపై సంచలన ఆరోపణలు చేశారు. తంబళ్లపల్లె నియోజకవర్గంలో తాలిబన్ రాజ్యం నడుస్తోందని విమర్శించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారిని గుర్తించడం లేదనీ, నిజమైన కార్యకర్తలకు వేధింపులు, అవమానాలే మిగులుతున్నా యన్నారు. ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి ఇష్టానూసారంగా నడుచుకుంటూ వ్యవహరిస్తున్నారనీ, ఆయన నియంతలా వ్యవహరిస్తున్నరని ఆరోపించారు. ఎమ్మెల్యే తనకు వ్యతిరేకంగా ఉండేవారిపై అక్రమంగా కేసులు పెట్టిస్తున్నారని, తనపై వరుసగా అక్రమ కేసులు పెట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆ తర్వాత కొండ్రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మద్దతు తెలిపారు. వైఎస్సార్సీపీ నేతను అన్యాయంగా అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి తంబళ్లపల్లెని తాలిబన్ రాజ్యం చేశారని సొంత పార్టీ నేతనే ఆరోపించారని గుర్తు చేశారు. పాత కేసును తిరగదోడి ఉగ్రవాదిలా అరెస్ట్ చేయించడం వైసీపీ నేతల ఫ్యాక్షన్ బుద్ధికి నిదర్శమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెంనాయుడు, శ్రీనివాసులు రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, శంకర్ యాదవ్, చల్లా బాబు రెడ్డి, మద్దిపట్ల సూర్యప్రకాష్, పర్వీన్ తాజ్ పాల్గొన్నారు.