మర్డర్ చేస్తామంటే చట్టం ఊరుకొంటుందా?: బుద్దా వెంకన్నకు కొడాలి వార్నింగ్

By narsimha lodeFirst Published Jan 24, 2022, 7:59 PM IST
Highlights

టీడీపీ చీఫ్ చంద్రబాబు సహా టీడీపీ నేతలపై ఏపీ మంత్రి కొడాలి నాని సీరియస్ అయ్యారు. తనను మంత్రివర్గం నుండి తప్పించేందుకు టీడీపీ తనపై లేనిపోని ఆరోపణలు చేస్తోందని ఆయన విమర్శించారు.

అమరావతి:మంత్రి పదవి నుండి నన్ను తప్పించాలని టీడీపీ కుట్ర పన్నిందని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని  చెప్పారు. తన కన్వెన్షన్ సెంటర్ లో క్యాసినో జరగకున్నా ఏదో జరిగిందని ప్రచారం చేశారని ఆ తర్వాత తాను సవాల్ చేసిన తర్వాత మాట మార్చారని మంత్రి గుర్తు చేశారు. తొలుత తన కన్వెన్షన్ సెంటర్ లో క్యాసినో జరిగిందన్నారు. ఆ తర్వాత తన కన్వెన్షన్ సెంటర్ కు సమీపంలో జరిగిందని ప్రచారం చేశారన్నారు. ఇప్పుడేమో గుడివాడలో క్యాసినో నిర్వహించారని ప్రచారం చేస్తున్నారని కొడాలి నాని ప్రస్తావించారు.చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే జూదశాలలు నడిచాయని ఆయన చెప్పారు.

సోమవారం నాడు రాత్రి అమరావతిలో ఏపీ మంత్రి Kodali Nani మీడియాతో మాట్లాడారు. తనపై టీడీపీ నేత బుద్దా వెంకన్న వ్యాఖ్యలపై మంత్రి కౌంటరిచ్చారు. అంతేకాదు చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. చంద్రబాబు ఇంట్లో వ్యభిచారం జరుగుతుందని ఆరోపణలు చేస్తే కెమెరాతో నిజ నిర్ధారణకు వస్తే చంద్రబాబు ఇంట్లోకి అనుమతిస్తారా అని కొడాలి నాని ప్రశ్నించారు.Buddha Venkanna నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని మంత్రి హెచ్చరించారు. మంత్రులను మర్డర్ చేస్తామంటే చట్టం ఊరుకుంటుందా అని మంత్రి ప్రశ్నించారు. 2024లో టీడీపీ అధికారంలోకి వస్తే తనను ముక్కలు ముక్కలుగా నరుకుతామని టీడీపీ నేత బుద్దా వెంకన్న చెప్పారన్నారు. ఒకవేళ టీడీపీ అధికారంలోకి రాకపోతే ఏం జరుగుతుందని ఆయన ప్రశ్నించారు. తాము అన్నింటికి కూడా సిద్దపడే ఉన్నామని మంత్రి నాని తెలిపారు. 

Chandrababu naidu  రాష్ట్రంలో ప్రతిపక్ష నేతగా ఉండడం దురదృష్టకరమన్నారు.చంద్రబాబు మతిమరుపు జబ్బుతో బాధపడుతున్నారని చెప్పారు.తనను ఏదో చేద్దామని ఎల్లో మీడియా తాపత్రయపడుతుందని మంత్రి నాని విమర్శించారు.వారం రోజులుగా ఎల్లో మీడియా తనపై దుష్ప్రచారం చేస్తోందని మంత్రి నాని మండిపడ్డారు.Gudivada లో ఏదో జరిగిపోతోందని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. కె కన్వెన్షన్ సెంటర్ లో క్యాసినో పెట్టారంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి నాని మండి పడ్డారు.

420 బ్యాచ్ ను జనం తరిమి కొట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని మంత్రి నాని చెప్పారు.రెండున్నర ఏళ్ల క్రితమే TDPని ప్రజలు సమాధి చేశారని కొడాలి నాని చెప్పారు.చంద్రబాబును రాజకీయ సమాధి చేసినా ఇంకా బుద్ది రాలేదన్నారు. అన్ని ఎన్నికల్లో డిపాజిట్లు రాకుండా టీడీపీని ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించారని మంత్రి నాని చెప్పారు.

సంక్రాంతిని పురస్కరించుకొని గుడివాడలో క్యాసినో నిర్వహించారని మీడియాాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. మంత్రి కె కన్వెన్షన్ సెంటర్లో ఇది జరిగిందని టీడీపీ ఆరోపించింది.ఈ విషయమై ఎస్పీకి కూడా ఫిర్యాదు చేసింది టీడీపీ.

ఈ నెల 21న గుడివాడకు వెళ్లిన టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ వెళ్లింది. కే కన్వెన్షన్ సెంటర్ వద్దకు వెళ్లకుండా టీడీపీ నిజనిర్ధారణ కమిటీని పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు.  నిజనిర్ధారణ కమటీలోని నేతలను అరెస్ట్ చేసిన తర్వాత  వైసీపీ నేతలు టీడీపీ కార్యాలయంపై రాళ్లు, కుర్చీలతో దాడికి దిగారు. ఈ దాడిని టీడీపీ శ్రేణులు ప్రతిఘటించే ప్రయత్నం చేశారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకొంది. ఇరు వర్గాలపై పోలీసులు లాఠీచార్జీ  చేసిన విషయం తెలిసిందే.

click me!