జగన్ కన్నెర్రజేస్తే మీ పదవి ఔట్: చంద్రబాబుపై అవంతి శ్రీనివాస్ ఫైర్

By Nagaraju penumalaFirst Published Oct 12, 2019, 3:51 PM IST
Highlights

సీఎం జగన్ కన్నెర్రజేస్తే తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా ఉండదన్నారు. ప్రతిపక్షం ఉండాలన్నే సదుద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరతామని వస్తున్నా అందుకు జగన్ అంగీకరించడం లేదన్నారు. 

విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై నిప్పులు చెరిగారు రాష్ట్రపర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పటి పాలనకు వైసీపీ పాలనకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. 

చంద్రబాబు నాయుడు తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనుగోలు చేశారని మండిపడ్డారు. కానీ తమ నాయకుడు, ఏపీ సీఎం జగన్ అలా చేయడం లేదన్నారు. జగన్ తలచుకుంటే చంద్రబాబు గతేంటో అందరికీ తెలుసునన్నారు. 

సీఎం జగన్ కన్నెర్రజేస్తే తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్ష హోదా కూడా ఉండదన్నారు. ప్రతిపక్షం ఉండాలన్నే సదుద్దేశంతో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరతామని వస్తున్నా అందుకు జగన్ అంగీకరించడం లేదన్నారు. అందువల్లే చంద్రబాబు ప్రతిపక్ష నేతగా అయినా ఉండగలుగుతున్నారని విమర్శించారు. 

సీఎం జగన్ అద్భుతమైన పాలన అందిస్తున్నారని చెప్పుకొచ్చారు. జగన్ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని దాన్ని ఓర్వలేకే చంద్రబాబు నాయుడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి అవంతి శ్రీనివాస్. 

తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీపై కక్షసాధింపునకు పాల్పడేదన్నారు. కనీసం సభలు పెట్టుకునేందుకు అయినా అనుమతులు కూడా ఇచ్చేవారు కాదని కానీ తాము అలా కాదన్నారు. అన్ని అనుమతులు ఇస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడులా తాము ఏనాడు ప్రవర్తించలేదని చెప్పుకొచ్చారు మంత్రి అవంతి శ్రీనివాస్. 

click me!