
ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ సచివాలయాలు, ఇతర వాహనాలకు వైసీపీ పార్టీ రంగులు వేయడంపై ఏపీ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు, మోటార్లకు వైసీపీ రంగులు వేయడంపై ఏపీ హైకోర్టు విచారించింది. ఆదేశాలు ఇచ్చినా అవే రంగులు ఎలా వేస్తారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ నెల 16న వ్యక్తిగతంగా హాజరుకావాలని ప్రతివాదులందరికీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
కాగా, 2020 ఏప్రిల్లో రాష్ట్రంలోని పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ పార్టీ జెండాను పోలిన రంగులు తొలగించాలని ఉన్నత న్యాయస్థానం సోమవారం ఆదేశించింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని పేర్కొంది. అయితే ఇందుకు 3 గడువు కావాలని ప్రభుత్వం న్యాయస్థానాన్ని కోరింది. దీనికి సమ్మతించిన ధర్మాసనం ఈ మేరకు గడువును ఇచ్చింది.
పంచాయతీ కార్యాలయాల రంగులు తీసేయాలని, ప్రభుత్వ కార్యాలయాలకు ఏ పార్టీతో సంబంధం లేని రంగులు వేయాలని హైకోర్టు గతంలోనే తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. అయితే తమకు మరికొంత గడువు కావాలని ప్రభుత్వం హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేసింది.
ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ కార్యాలయాలకు ఆ పార్టీకి జెండాను పోలిన రంగులు వేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఫోటోలు చక్కర్లు కొట్టాయి. ఈ విషయంపై పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై అప్పట్లో విచారణ జరిపిన హైకోర్టు.. జగన్ ప్రభుత్వంపై సీరియస్ అయ్యింది. వెంటనే ఆ రంగుల్ని తొలగించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.