ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో అరెస్టైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.. తనపై నమోదైన మరో కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. రాజధాని అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సీఐడీ అధికారులు చంద్రబాబుతో పాటు పలువురిపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై విచారణను ఏపీ హైకోర్టు నేటికి(సెప్టెంబర్ 19)కి వాయిదా వేసింది.
ఈ క్రమంలోనే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ హైకోర్టులో ఈరోజు విచారణకు వచ్చింది. అయితే ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేస్తున్నట్టుగా ఏపీ హైకోర్టు వెల్లడించింది.
ఈ కేసు విషయానికి వస్తే.. టీడీపీ నేతల ఆధీనంలో ఉన్న భూముల విలువను పెంచేందుకు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అసలు డిజైన్ను అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మార్పులు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేర్కొంది. ఇందుకు సంబంధించి ఐపీసీ, అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద గతేడాది ఏప్రిల్లో సీఐడీ కేసు నమోదు చేసింది. చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి పొంగూరు నారాయణ, నారా లోకేష్, లింగమనేని గ్రూప్ ఆఫ్ కంపెనీలకు చెందిన వ్యాపారవేత్తలు లింగమనేని రమేష్, లింగమనేని వెంకట సూర్య రాజశేఖర్, ఆర్కె హౌసింగ్ లిమిటెడ్కి చెందిన కేపీవీ అంజనీ కుమార్, రామ కృష్ణ హౌసింగ్ ప్రై. లిమిటెడ్, హెరిటేజ్ ఫుడ్స్ ప్రై. లిమిటెడ్లతో పాటు ఇతరులను ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
అమరావతి క్యాపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్ రోడ్ (ఐఆర్ఆర్), సీడ్ క్యాపిటల్ల అలైన్మెంట్లను ఉద్దేశపూర్వకంగా, గణించిన పద్ధతిలో నారాయణ గ్రూప్ సంస్థలకు అనవసరమైన సంపదను అందించేందుకు చంద్రబాబు నాయుడు, నారాయణ కుట్ర పన్నారని ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.