కోర్టు ధిక్కరణ నేరం: ఎమ్మార్వోకి హైకోర్టు శిక్ష

By Siva KodatiFirst Published Jan 7, 2021, 5:45 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాధికారులపై హైకోర్టు గత కొన్ని రోజులుగా కొరడా ఝుళిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కృష్ణా జిల్లాకు చెందిన ఓ ఎమ్మార్వోకి కోర్టు షాకిచ్చింది. సుమోటోగా తీసుకుని మరీ చర్యలకు ఆదేశించింది.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వాధికారులపై హైకోర్టు గత కొన్ని రోజులుగా కొరడా ఝుళిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా కృష్ణా జిల్లాకు చెందిన ఓ ఎమ్మార్వోకి కోర్టు షాకిచ్చింది. సుమోటోగా తీసుకుని మరీ చర్యలకు ఆదేశించింది.

కోర్టు ఉత్తర్వులను పట్టించుకోకుండా చేసిన పనికి అక్షింతలు వేసింది. ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంలో తహసీల్దార్ తీసుకున్న నిర్ణయాలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

కోర్టు ధిక్కరణ నేరం కింద జరిమానా విధించింది. జరిమానా చెల్లించకుంటే జైలు శిక్ష అనుభవించాలని ధర్మాసనం ఆదేశించింది. నవరత్నాల పథకాలకు అసైన్డ్ భూములు తీసుకోవద్దని న్యాయస్థానం గతంలో సూచించింది.

అయితే ఆ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దార్ మదన్ మోహన్ రావు అసైన్డ్‌ భూమి తీసుకున్నారు. దీంతో ఈ వ్యవహారాన్ని న్యాయస్థానం సుమోటోగా తీసుకుంది.

ఈ నేపథ్యంలో తహసీల్దార్‌కు రూ.2 వేల జరిమానా విధించింది. దీనిని చెల్లించకుంటే 2 నెలలు జైలు శిక్ష అనుభవించాలని హైకోర్టు ఆదేశించింది.

click me!