మా ఆదేశాలనే లెక్కే చేయరా.. విధుల్లో చేరని అంగన్‌వాడీలపై జగన్ సర్కార్ కన్నెర్ర , తొలగింపుకు ఆర్డర్లు రెడీ ..?

By Siva KodatiFirst Published Jan 22, 2024, 9:50 PM IST
Highlights

సమస్యల సాధన కోసం గత 42 రోజులుగా ఆందోళన నిర్వహిస్తోన్న అంగన్‌వాడీలు, హెల్పర్లు తమ సమ్మెను తీవ్రతరం చేశారు. తమ ఆదేశాలను బేఖాతరు చేస్తూ విధుల్లో చేరని ఉద్యోగులను తొలగించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. 

సమస్యల సాధన కోసం గత 42 రోజులుగా ఆందోళన నిర్వహిస్తోన్న అంగన్‌వాడీలు, హెల్పర్లు తమ సమ్మెను తీవ్రతరం చేశారు. ఈ క్రమంలో ఏపీ ప్రభుత్వం వారిపై కన్నెర్ర చేసింది. తమ ఆదేశాలను బేఖాతరు చేస్తూ విధుల్లో చేరని ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. సోమవారం ఉదయం 9.30 గంటల కల్లా విధుల్లో చేరాలని ప్రభుత్వం అంగన్‌వాడీలను ఆదేశించింది. 

ప్రభుత్వ ఆదేశాల మేరకు కేవలం 20 శాతం మంది అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు విధుల్లో చేరారు. మిగిలినవారు తమ మాటను లెక్క చేయకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. గుంటూరు జిల్లాలో విధులకు హాజరుకాని 1734 మందిని, పల్నాడు జిల్లాలో 1358 మందిని తొలగిస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లు టెర్మినేషన్ ఆర్డర్లను జారీ చేశారు. ఈ విధంగా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 80 వేల మందికిపైగా సిబ్బందిని తొలగించినట్లుగా కథనాలు వస్తున్నాయి. డిసెంబర్ 12 నుంచి అంగన్‌వాడీ కార్యకర్తలు, హెల్పర్లు సమ్మె చేస్తున్నారు. దాదాపు 1,04,000 మందికి ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. 

Latest Videos

ఇదిలావుండగా.. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అర్ధరాత్రి అక్రమంగా అరెస్టు చేసి వారిని వివిధ ప్రాంతాలకు తరలించారు. సోమవారం సాయంత్రం ఊరు కాని  ఊరిలో అంగనవాడీలని  వదిలేశారు పోలీసులు . దీంతో ఎలా వెళ్లాలో , ఎటు వెళ్లాలో తెలియక రోడ్డుపై బైఠాయించి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అంగన్ వాడీలు. చిత్తూరు జిల్లా నుంచి విజయవాడలో దీక్ష శిబిరానికి వచ్చిన అంగన్‌వాడీలు మీడియాతో మాట్లాడుతూ..  అర్ధరాత్రి 2 గంటల సమయంలో పోలీసులు నిద్రపోతున్న మమ్మల్ని బలవంతంగా అరెస్ట్ చేసి రాత్రంతా తిప్పారని చెప్పారు. సోమవారం ఉదయం 8 గంటలకు  కైకలూరు పోలీస్టేషన్ కి తరలించారని, సాయంత్రం విజయవాడ తీసుకెళ్తామని మమ్మల్ని  వ్యాన్ లో ఎక్కించారని పేర్కొన్నారు. 

కానీ .. రాజమండ్రి ‌వద్ద భీమడోలు తీసుకొచ్చి రోడ్డుపై వదిలేశారని అంగన్‌వాడీలు మండిపడుతున్నారు. ఇక్కడి నుంచి ఎలా వెళ్లాలో తెలియక మంచినీళ్,లు ఆహారం లేక అవస్థలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కనికరం  లేకుండా వ్యవహరించడం దుర్మార్గమని , సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీల అమలు చేయాలని కోరడం తప్పా అని అంగన్‌వాడీలు ప్రశ్నిస్తున్నారు.

జగనన్న జగనన్న అని వెంటపడి ఓట్లేసి గెలిపించినందుకు మాకు బాగా బుద్ధి చెప్పారని దుయ్యబట్టారు. నా అక్,క నా చెల్లి అని చెప్పుకునే జగన్ కు అంగనవాడీల ఆవేదన కనిపించడం లేదా అని వారు నిలదీశారు. జగన్‌ను నమ్మినందుకు మాకు బాగా బుద్ధి చెప్పారని.. ఇప్పుడైనా స్పందించకుంటే వచ్చే ఎన్నికలలో  బుద్ధి చెబుతామని అంగన్‌వాడీలు హెచ్చరించారు. 
 

click me!