కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు వ్యవహరం మళ్లీ మొదటికి వచ్చింది. స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం జగన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకొన్న కంపెనీ ఆర్ధిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఈ కంపెనీతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని పెండింగ్ లో పెట్టింది జగన్ సర్కార్.
కడప: కడప జిల్లాలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు వ్యవహరం మళ్లీ మొదటికి వచ్చింది. స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణం కోసం జగన్ ప్రభుత్వం ఒప్పందం చేసుకొన్న కంపెనీ ఆర్ధిక పరిస్థితి బాగా లేకపోవడంతో ఈ కంపెనీతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని పెండింగ్ లో పెట్టింది జగన్ సర్కార్.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలం నుండి కూడ కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో స్టీల్ ప్లాంట్ నిర్మాణం నిలిచిపోయింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు మరోసారి కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపనచేశారు.
అప్పట్లో టీడీపీలో ఉన్న ఎంపీ సీఎం రమేష్ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం ఆమరణ నిరహారదీక్ష చేశారు.2019 లో జరిగిన ఎన్నికల్లో ఏపీలో జగన్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది. జగన్ ప్రభుత్వం కూడ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం లిబర్టీ స్టీల్స్ కంపెనీతో ఒప్పందం చేసుకొంది.
అయితే ఆ కంపెనీ ఆర్ధిక పరిస్థితి బాగా లేదని ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గౌతం రెడ్డి బుధవారం నాడు ప్రకటించారు. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని పెండింగ్ లో పెట్టినట్టుగా ఆయన చెప్పారు.స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం బిడ్ దాఖలు చేసిన కంపెనీల్లో ఏ2 నిలిచిన కంపెనీతో ప్లాంట్ నిర్మించాలా లేదా ప్రభుత్వమే ప్లాంట్ నిర్మించాలా అనే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని మంత్రి ప్రకటించారు.లిబర్టీ కంపెనీ ఆర్ధిక పరిస్థితి బాగా లేకపోవడంతో ప్లాంట్ నిర్మాణం పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.