
మార్కెట్లో కూరగాయల ధరలు అకస్మాత్తుగా పెరగడంతో వినియోగదారులకు భారీ షాక్కు గురిచేస్తోంది. వంటల్లో ప్రధానంగా వినియోగించే టమాటాలు, పచ్చిమిర్చి ధరలు విపరీతంగా పెరిగాయి. వర్షాలతో పలుచోట్ల టమాటా పంట దెబ్బతినడంతో ఈ పరిస్థితి తలెత్తిందని చెబున్నారు. ఈ క్రమంలోనే మొన్నటివరకు కిలో రూ.10కు కూడా లభించిన టమాటా ధర ప్రస్తుతం భగ్గుమంటుంది. అనేక ప్రాంతాల్లో టమాటా ధర కిలో రూ.100కి పైనే పలుకుతుంది. దీంతో సామాన్యులు వాటిని ఆచితూచి వాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఈ ధరల భారం నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది.
టమాటాలను రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసి ప్రధాన నగరాలు, పట్టణ ప్రాంతాల్లోని రైతుబజార్లలో కిలో రూ. 50కే అందుబాటులో ఉంచేలా ఏపీ సర్కార్ చర్యలు చేపట్టింది. కర్నూలు, కడప జిల్లాలలో బుధవారం నుంచి సబ్సిడీపై టమాటాలు అందిస్తున్నారు. రాష్ట్రంలో మిగిలిన జిల్లాల్లో గురువారం నుంచి సబ్సీడీపై టమాటాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశారు.
ప్రజలకు సబ్సిడీపై టమాటాలను అందించడం కోసం ప్రతి రోజూ 50 నుచి 60 టన్నుల టమాటాలు సేకరించాలని అధికారులు నిర్ణయించారు. రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్ల ద్వారా సబ్సిడీపై టమాటా అమ్మకాలు చేపట్టనున్నారు. మరోవైపు పచ్చిమిర్చి ధర కూడా భగ్గుమంటుండటంతో.. దానిని కూడా సబ్సిడీ కింద అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టుగా ఏపీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.