అమరావతిలో టీడీపీ నేతల ఆస్తుల చిట్టా ఇదే

By sivanagaprasad KodatiFirst Published Dec 17, 2019, 5:09 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అమరావతికి సంబంధించి వాడి వేడి చర్చ జరిగింది. ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. రాజధాని పరిసర ప్రాంతాల్లో చంద్రబాబు తనకు కావాల్సిన వారికి 4 వేల ఎకరాలకు పైగా కేటాయించారని బుగ్గన పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అమరావతికి సంబంధించి వాడి వేడి చర్చ జరిగింది. ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. రాజధాని పరిసర ప్రాంతాల్లో చంద్రబాబు తనకు కావాల్సిన వారికి 4 వేల ఎకరాలకు పైగా కేటాయించారని బుగ్గన పేర్కొన్నారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మిగిలిందన్నారు. 13 జిల్లాల్లో ఏడున్నర జిల్లాలు బాగా వెనుకబడిన ప్రాంతాలని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.

అమరావతిలో భూములు వున్న టీడీపీ నేతలు:

హెరిటేజ్ - 14.22 ఎకరాలు
నారాయణ, ఆవుల మునీశంకర్, రావూరి సాంబశివరావు, ప్రమీలల పేరు మీద 55.27 ఎకరాలు
ప్రత్తిపాటి పుల్లారావు -38.84 ఎకరాలు
పరిటాల సునీత తన అల్లుడి పేరు మీద, రావెల కిశోర్ బాబు 40.85 ఎకరాలు, మైత్రి ఇన్‌ఫ్రా విశాఖపట్నం, కొమ్మాలపాటి శ్రీధర్ 68.60 ఎకరాలు, జీవీఎస్ ఆంజనేయులు 37.84 ఎకరాలు 
పయ్యావుల కేశవులు 15.30 ఎకరాలు
పల్లె రఘునాధరెడ్డి 7.56 ఎకరాలు
వేమూరి రవికుమార్ ప్రసాద్ 25.68 ఎకరాలు
లింగమనేని రమేశ్ 351 ఎకరాలు
పుట్టా మహేశ్ యాదవ్ 7 ఎకరాలు
కోడెల శివప్రసాద రావు 17.13
దూళిపాళ్ల నరేంద్ర చౌదరి 13.50

విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మిగిలిందన్నారు. 13 జిల్లాల్లో ఏడున్నర జిల్లాలు బాగా వెనుకబడిన ప్రాంతాలని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. విభజన తర్వాత బాధ్యతలు చేపట్టిన కొత్త ప్రభుత్వానికి మొదటి ఐదేళ్లు కీలకమైనదని బుగ్గన తెలిపారు.

క్యాన్సర్‌తో బాధపడుతూ కూడా శివరామకృష్ణన్ 10 జిల్లాల్లో పర్యటించి తయారుచేసిన నివేదికను చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదని ఆయన మండిపడ్డారు. శివరామకృష్ణన్, రవిచంద్రన్ వంటి నిపుణులు రూపొందించిన నివేదికను పక్కనపెట్టి.. చంద్రబాబు నాయుడు నారాయణ కమిటీ వేశారని తెలిపారు.

రాజధానిని ఎక్కడ పెట్టాలనే దానిపై 5 కోట్ల మంది ఆంధ్రుల్లో 1400 మంది ఫోన్‌లో తెలిపిన అభిప్రాయాలను పరిగణనలోనికి తీసుకుని అమరావతిని ఎంపిక చేయడం భావ్యమా అని ఆయన ప్రశ్నించారు. పక్క రాష్ట్రం రాజకీయాల్లో వేలు పెట్టి అమరావతికి పారిపోయి వచ్చి ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని బుగ్గన వెల్లడించారు. 

చంద్రబాబు ప్రభుత్వం రాజధానిని ప్రకటించడానికి ముందే పలు ప్రాంతాల నుంచి టీడీపీ నేతలు వచ్చి తుళ్లూరు, లింగాయపాలెం తదితర గ్రామాలను పరిశీలించి వెళ్లారని బుగ్గన వెల్లడించారు.

రాజధాని గుంటూరులో అని ఒకసారి.. నూజివీడులో అని మరోసారి చెప్పి అమరావతి ప్రాంతంలో భూములు సైలెంట్‌గా భూములు కొనుగోలు చేశారని.. దీనిని ఇన్‌సైడర్ ట్రేడింగ్ అనకుండా ఏమని పిలుస్తారని బుగ్గన ప్రశ్నించారు.

మున్సిపల్ కార్పోరేషన్ ఆఫ్ ఢిల్లీ 1,397 కిలోమీటర్లలో ఉంటే మన రాజధాని ప్రాంతం 8,352 చ.కి.మీ విస్తీర్ణంలో ఉందని, చెన్నై 426 చ.కి.మీ, కోల్‌కతా 1,886 చ.కి.మీ పరిధిలో మాత్రమే ఉన్నాయని రాజేంద్రనాథ్ రెడ్డి తెలిపారు.

బాలకృష్ణ వియ్యంకుడు వీబీసీ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ అధినేత రామారావుకు జగ్గయ్యపేటలో 499 ఎకరాలు పరిశ్రమల కింద కేటాయించారని ఆయన పేర్కొన్నారు. అమరావతి చుట్టూ రూపొందించిన రింగ్‌రోడ్‌ను టీడీపీ నేతల భూముల మీదుగా వెళ్లేటట్లు డిజైన్ చేశారని.. పరిపాలనను గాలికొదిలేసి దీనిపైనే చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెట్టిందని రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు.

కురగల్లు, యర్రబాలెం, నవులూరు ప్రాంతాల్లోని దళిత రైతులను భయపెట్టి వారి భూములు కొనుగోలు చేశారని మంత్రి పేర్కొన్నారు. లేని లంక భూములు ఉన్నట్లుగా చూపించి టీడీపీ నేతలకు ఫ్లాట్లు వచ్చేలా చేశారని ఆయన ఆరోపించారు. 
 

click me!