కరోనాపై పోరు: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కీలక ఆదేశాలు

Published : May 23, 2020, 03:05 PM IST
కరోనాపై పోరు: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కీలక ఆదేశాలు

సారాంశం

కరోనా వైరస్‌ నియంత్రణపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు వైరస్ వ్యాప్తిని నివారించేందుకు కీలక ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వైద్య, నర్సింగ్‌ సిబ్బంది పోస్టులను అత్యవసరంగా భర్తీ చేయాలని ఆదేశించారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి అంతకంతకు పెరుగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు మరిన్ని చర్యలను చేపట్టే దిశగా మరో ముందడుగు వేసింది జగన్ మోహన్ రెడ్డి సర్కార్. 

కరోనా వైరస్‌ నియంత్రణపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులకు వైరస్ వ్యాప్తిని నివారించేందుకు కీలక ఆదేశాలు జారీచేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వైద్య, నర్సింగ్‌ సిబ్బంది పోస్టులను అత్యవసరంగా భర్తీ చేయాలని ఆదేశించారు. 

8 జిల్లాల్లోని ప్రత్యేక కోవిడ్‌ ఆస్పత్రుల్లో ప్రస్తుతమున్న ఐసోలేషన్‌ బెడ్స్, ఆక్సిజన్‌ సదుపాయాలను మరింతగా పెంచేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు. వైరస్‌ సోకడం తప్పేమీ కాదని, నేరం అంతకన్నా కాదని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. 

అంతే కాకుండా, కరోనా‌ పట్ల ప్రజల్లో ఉన్న భయాందోళనలను తొలగించాలని అధికారులకు తెలిపారు. వైరస్‌ ఎవరికైనా సోకే ఆస్కారం ఉందని, పరీక్షలకు స్వచ్ఛందంగా ప్రజలు ముందుకురావాలిన సీఎం జగన్‌ కోరారు. 

వ్యక్తిగత పరిశుభ్రత, జాగ్రత్తలు, సమయానుకూలమైన వైద్య సహాయంతో వైరస్‌ సోకిన బాధితులు కోలుకోవడం చాలా సులభమని సీఎం వ్యాఖ్యానించారు. ఈ మేరకు వైరస్ పై ప్రతి గ్రామంలోని ప్రజలకు అవగాహాన కల్పించాలన్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. 

ఈ రివ్యూ మీటింగులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో పాటు ఉపముఖ్యమంత్రి ఆళ్లనాని, చీఫ్ సెక్రటరీ నీలంసాహ్ని.. ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి జవహర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

ఇకపోతే... ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు కట్టడి కావడం లేదు. అయితే, శుక్రవారం కన్నా శనివారంనాడు కాస్తా తక్కువ కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో ఏపీలో కొత్తగా 47 కోవిడ్ -19 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2561కి చేరుకుంది. 

తాజాగా గత 24 గంటల్లో 47 మంది కరోనా వైరస్ నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు 1778 మంది డిశ్చార్జీ అయ్యారు. తాజాగా కృష్ణా జిల్లాలో మరో మరణం సంభించింది. దీంతో మొత్తం కరోనా వైరస్ మృతుల సంఖ్య 56కు చేరుకుంది. ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 727గా ఉంది.   

PREV
click me!

Recommended Stories

ఇఫ్తార్ విందులో పాల్గొన్న జగన్ | YS Jagan Attends Iftar Dinner | Asianet News Telugu
దివ్యాంగులతో టికెట్ తీసుకొని బస్సులో ప్రయాణించిన సీఎం | Divyang Shakti Scheme | Asianet News Telugu