పద్మవ్యూహంలో చిక్కుకోవడానికి అభిమాన్యుడిని కాదు .. అర్జునుడిని : భీమిలి సభలో జగన్ వ్యాఖ్యలు

By Siva KodatiFirst Published Jan 27, 2024, 5:13 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ విశాఖ జిల్లా భీమిలి నుంచి ఎన్నికల శంఖారావం పూరించారు. చంద్రబాబుతో సహా అందరినీ ఓడించాల్సిందేనని, ఈ అర్జునుడికి తోడుగా దేవుడితో పాటు ప్రజలు వున్నారని  జగన్ పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్ విశాఖ జిల్లా భీమిలి నుంచి ఎన్నికల శంఖారావం పూరించారు. సిద్ధం పేరుతో శనివారం జరిగిన భారీ బహిరంగసభలో జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తూ.. అటువైపు కౌరవ సైన్యం వుందని, వారి సైన్యంలో గజదొంగల ముఠా వుందన్నారు. కానీ ఇక్కడ వున్నది అభిమాన్యుడు కాదు.. అర్జునుడని సీఎం వ్యాఖ్యానించారు. చంద్రబాబుతో సహా అందరినీ ఓడించాల్సిందేనని, ఈ అర్జునుడికి తోడుగా దేవుడితో పాటు ప్రజలు వున్నారని  జగన్ పేర్కొన్నారు. మీ అందరి అండదండలు వున్నంతకాలం తాను తొణకను బెణకనని వైసీపీ చీఫ్ అన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని నెరవేర్చామని, 175కి 175 సీట్లు గెలుపే మన టార్గెట్ అని జగన్ స్పష్టం చేశారు. 

ఇప్పటి వరకు 99 శాతం హామీలు నెరవేర్చామని, కురుక్షేత్ర యుద్ధానికి సిద్ధమైన పాండవ సైన్యం తనకు ఇక్కడ కనిపిస్తోందని సీఎం అన్నారు. మనం చేసిన మంచి పనులే మనల్ని గెలిపిస్తాయని.. వారి కుట్రలు, కుతంత్రాలు, మోసపూరిత వాగ్థానాల పద్మవ్యూహం కనిపిస్తోందని జగన్ ఎద్దేవా చేశారు. చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదని.. ప్రతి ఇంటికి చేసిన మంచి పనులతో ఈసారి ఆయనతో సహా అందరూ ఓడాల్సిందేని సీఎం పేర్కొన్నారు. ఒంటరిగా పోటీ చేయలేక పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాడని, చంద్రబాబు దత్తపుత్రుడిని వెంటేసుకుని తిరుగుతున్నాడని జగన్ దుయ్యబట్టారు. 

Latest Videos

భీమిలీలో అటు సముద్రం, ఇటు జన సముద్రం కనిపిస్తోందన్నారు. 175 స్థానాల్లో పోటీ చేసేందుకు వారికి అభ్యర్ధులు కూడా లేరని, కొత్త వాగ్థానాలతో గారడీ చేయాలని చూస్తున్నారని జగన్ మండిపడ్డారు. మరో 70 రోజుల్లోనే ఎన్నికలు జరగనున్నాయని.. అబద్ధానికి, నిజానికి మధ్య .. మోసం, విశ్వసనీయతకు మద్ధక్ష్ ఈ యుద్ధం జరుగుతోందన్నారు. ఈ 56 నెలల్లో గ్రామాల్లో వచ్చిన మార్పులు కనిపిస్తున్నాయని జగన్ పేర్కొన్నారు. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు చంద్రబాబు ఏం చేశారో చెప్పడానికి ఏం కనిపించదన్నారు. 2014లో చంద్రబాబు 570 వాగ్ధానాలు ఇచ్చారని.. మన ప్రభుత్వంలో లంచాలు, వివక్షకు తావు లేకుండా ప్రతి ఒక్కరికి పథకాలు అందిస్తున్నామని జగన్ తెలిపారు. 

ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్‌లు ఏర్పాటు చేశామని, 670 వాగ్ధానాల్లో 10 శాతం కూడా చంద్రబాబు అమలు చేయలేదని సీఎం దుయ్యబట్టారు. నాడు నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్లను అభివృద్ధి చేశామని, ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చామన్నారు. రుణమాఫీ అంటే గుర్తొచ్చేది చంద్రబాబు మోసమేనని, 14 ఏళ్ల పాలనలో ఆయన మార్క్ ఏంటి అని జగన్ ప్రశ్నించారు. పేద సామాజిక వర్గాల మీద నాకు ప్రేమ వుంది కాబట్టే సగం నామినేటెడ్ పదవులు ఇచ్చామన్నారు. చంద్రబాబు ఏం చేశారో చెప్పడానికి ఏమీ కనిపించదన్నారు. కేబినెట్‌లో 68 శాతం మంత్రి పదవులు బలహీనవర్గాలకు ఇచ్చామని జగన్ పేర్కొన్నారు. 

ఎస్సీల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని చంద్రబాబు వ్యాఖ్యానించారని సీఎం ధ్వజమెత్తారు. 2 లక్షల 13 వేల ప్రభుత్వ ఉద్యోగాలు తీసుకొచ్చామని, ఎక్కడ చూసినా కనిపించేది జగన్, వైసీపీ మార్కేనని జగన్ పేర్కొన్నారు. గ్రామాల్లో 5 వందలకుపైగా పౌర సేవలు అందిస్తున్నామని సీఎం చెప్పారు. ఇవాళ రైతు భరోసా అంటే గుర్తొచ్చేది మీ జగన్ అని ఆయన వ్యాఖ్యానించారు. పేద కులాలకు చెందిన నలుగురిని డిప్యూటీ సీఎంలుగా చేశామని జగన్ చెప్పారు. 80 శాతం ప్రభుత్వ ఉద్యోగాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ , మైనార్టీలకే ఇచ్చామని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇన్ని నిజాలు తెలిశాక.. చంద్రబాబుకు ఎవరైనా ఓటు వేస్తామని అనగలరా అని జగన్ ప్రశ్నించారు. 

పేదలకు చంద్రబాబు ఒక్కటంటే ఒక్క ఇళ్ల పట్టా కూడా ఇవ్వలేదని దుయ్యబట్టారు. రాష్ట్రంలో సుపరిపాలన తీసుకొచ్చామని చెప్పడానికి గర్వపడుతున్నానని సీఎం పేర్కొన్నారు. ప్రతి పేదవాడికి న్యాయం చేశామని, ఏకంగా 2 లక్షల 53 వేల కోట్లను అక్కాచెల్లెమ్మల ఖాతాలో జమ చేశామని జగన్మోహన్ రెడ్డి తెలిపారు. మహిళలకు 31 లక్షల ఇళ్ల పట్టాలు అందజేశామని సీఎం గుర్తుచేశారు. మన ఐదేళ్ల పాలనలో మహిళలు, రైతులు, అవ్వాతాతల బ్యాంక్ ఖాతాల్లో ఎం వేశామో చూడాలని జగన్ సూచించారు. 


 

click me!