మండలి అవసరమా.. సోమవారం చర్చిద్దాం: అసెంబ్లీలో జగన్

By Siva KodatiFirst Published Jan 23, 2020, 6:09 PM IST
Highlights

శాసనమండలిని కొనసాగించాలా వద్దా అన్న దానిపై చర్చించి నిర్ణయం తీసుకుందామన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. బుధవారం మండలిలో జరిగిన పరిణామాలపై అసెంబ్లీలో ప్రసంగించిన ఆయన ఛైర్మన్ తీరును తప్పుబట్టారు

శాసనమండలిని కొనసాగించాలా వద్దా అన్న దానిపై చర్చించి నిర్ణయం తీసుకుందామన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్. బుధవారం మండలిలో జరిగిన పరిణామాలపై అసెంబ్లీలో ప్రసంగించిన ఆయన ఛైర్మన్ తీరును తప్పుబట్టారు.

కేవలం సూచనల కోసమే మండలిని ఏర్పాటు చేసుకున్నామని, అయితే ఆర్టికల్ 174 ప్రకారం ఎక్కడి నుంచైనా చట్టాలు చేయొచ్చునని జగన్ తెలిపారు. 22 రాష్ట్రాల్లో మండళ్లు లేవని.. కానీ ఏపీలో మండలి కోసం రూ.60 కోట్లు ఖర్చు చేస్తున్నామని.. పేద రాష్ట్రమైన మనకు మండలి అవసరమా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.

Also Read:మండలి ఛైర్మన్ స్పీచ్ ఇదే, అందరూ చూడాలి: అసెంబ్లీలో జగన్

ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా, చట్టంతో, రూల్స్‌తో సంబంధం లేకుండా పనిచేస్తున్న ఈ మండలి అవసరమా అని సీఎం ప్రశ్నించారు. మన అసెంబ్లీలోనే పలువురు మేధావులు ఉన్నారన్నారు. ప్రజలకు మంచి జరగకుండా అడ్డుకుంటున్న మండలిని కొనసాగించాలో లేదో ఆలోచించాలని సీఎం సూచించారు. 

మండలి చట్టసభలో భాగం కాబట్టి.. చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా వ్యవహరిస్తుందని నమ్మామని కానీ ఐదు కోట్ల మంది ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తూ తంతు నడిచిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.

2019 అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాలకు గాను 151 మంది ఎమ్మెల్యేలతో 86 శాతం మందితో అసెంబ్లీ ఏర్పాటైందన్నారు సీఎం . ఇది ప్రజల సభని, ప్రజలు ఆమోదించిన సభని.. ఈ సభ చట్టాలు చేయడానికి ఏర్పాటైన సభన్నారు. ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కోసం ఏర్పాటైన సభన్నారు.

గత ఏడున్నర నెలలుగా ఎన్నో కీలక చట్టాలను ఈ సభలో చేశామని.. భారతదేశ చరిత్రలోనే కనివీని ఎరుగని స్థాయిలో ప్రజలు మాకు అధికారాన్ని అందించారని సీఎం తెలిపారు. తాము పాలకులం కాదని, సేవకులమని తొలి రోజు నుంచే చెప్పుకుంటూ వస్తున్నామని.. ఇప్పటికీ ఆ మాటకు కట్టుబడి ఉన్నామని జగన్ స్పస్టం చేశారు.

Also Read:5 కోట్ల మంది నమ్మకాన్ని వమ్ము చేశారు: మండలిలో పరిణామాలపై జగన్ ఆవేదన

బుధవారం శాసనమండలిలో జరిగిన పరిణామాలు తన మనసును ఎంతగానో బాధించాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. గ్యాలరీ కూర్చొని చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారన్నారు. తాము పంపిన బిల్లులను మండలిలో చర్చించి ఆమోదించివచ్చునని లేదంటే తిప్పి పంపివచ్చునని సీఎం తెలిపారు.

రూల్స్ క్లియర్‌గా ఉన్నా... నిబంధనలకు విరుద్ధంగా తనకు లేని విచక్షణాధికారాన్ని ఉపయోగించి ఆలస్యం చేసేలా ఛైర్మన్ తీసుకున్న నిర్ణయం దురదృష్టకరమని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు న్యాయం జరగకుండా ఉండేందుకు శాసనమండలిని వాడుకోవాలని చూడటం దుర్మార్గమన్నారు. 

click me!