వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందిస్తుంటే దాన్ని ఓర్వలేని వాళ్లు ప్రభుత్వంపై రాళ్లు వేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక విధానంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. అవినీతిని అడ్డుకోవడాన్ని సహించలేని వారు లేని పోని రాద్ధాంతాలు సృష్టిస్తున్నారంటూ మండిపడ్డారు.
వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి రహిత పాలన అందిస్తుంటే దాన్ని ఓర్వలేని వాళ్లు ప్రభుత్వంపై రాళ్లు వేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక విధానంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వంపై విమర్శలు రాకుండా ఇసుక పాలసీని అమలు చేసే బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. స్టాక్యార్డు పాయింట్లు పెంచాలని అధికారులను ఆదేశించారు. వరద తగ్గగానే రీచ్ల నుంచి ఇసుకను స్టాక్ యార్డులకు చేర్చాలని అధికారులకు సూచించారు. ఇసుక మాఫియాను అరికట్టేందుకు సాంకేతిక సహకారం తీసుకోవాలని స్పష్టం చేశారు.
ఏ స్ధాయిలోనూ అవినీతి అనేది కనిపించొద్దని అధికారులకు ఆదేశించారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవడానికి చెక్ పోస్టుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. సీసీ పుటేజీని మానిటరింగ్ చేసే వ్యవస్ధ కూడా ఉండాలని జగన్ స్పష్టం చేశారు. బల్క్ యూజర్ల కోసం ప్రత్యేక స్టాక్ యార్డులు ఏర్పాటు చేయనున్నట్లు జగన్ తెలిపారు.
నిర్మాణ దారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశించారు. ఏయే ప్రాంతాల్లో ఇసుక కొరత ఉంటుందో ఆయా ప్రాంతాల నిర్మాణ దారులకు ముందుగా సమాచారం ఇవ్వాలని సూచించారు. అలా చేసినట్లైతే వారు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటారని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.