విశాఖ దుర్ఘటన... గ్రామ వాలంటీర్లకే ఆ కీలక బాధ్యతలు: ముఖ్యమంత్రి నిర్ణయం

Arun Kumar P   | Asianet News
Published : May 11, 2020, 10:26 AM ISTUpdated : May 11, 2020, 10:28 AM IST
విశాఖ దుర్ఘటన... గ్రామ వాలంటీర్లకే ఆ కీలక బాధ్యతలు: ముఖ్యమంత్రి నిర్ణయం

సారాంశం

విశాఖ గ్యాస్ లీకేజీ ఘటనపై ముఖ్యమంత్రి జగన్ మరోసారి సమీక్షా సమావేశం నిర్వహించి అధికారులు, మంత్రులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. 

అమరావతి: విశాఖపట్నంలో గ్యాస్‌ లీక్‌ దుర్ఘటనపై మరోమారు మంత్రులు, అధికారులతో సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ  సందర్భంగా బాధితులను ఆదుకోవాలంటూ కీలక ఆదేశాలు జారీ చేశారు ముఖ్యమంత్రి. గ్యాస్‌ బాధితులు ఇళ్లకు చేరుకునేలా పరిస్థితులను మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. సోమవారం ఉదయం నుంచి ప్రభావిత గ్రామాల్లో ప్రతి ఇంటా, బయటా కూడా పూర్తిస్థాయిలో రసాయన అవశేషాలు లేకుండా శానిటేషన్‌ కార్యక్రమాలు  చేపట్టాలని సీఎం ఆదేశించారు.  

అంతేకాకుండా ఇవాళ సాయంత్రానికే  ఆయా గ్రామాల ప్రజలు ఇళ్లకు చేరేలా చూడాలని సూచించారు. అక్కడి ప్రజలకు ధైర్యాన్నిచ్చేలా మంత్రులు గ్యాస్ ప్రభావిత గ్రామాల్లో రాత్రి బస చేయాలని ఆదేశించారు. ఆస్పత్రిలో వైద్యం తీసుకుని, డిశ్చార్జి అవుతున్న ప్రజలు తిరిగి ఇళ్లకు చేరేంతవరకూ ప్రతి ఒక్కరి బాధ్యతను తీసుకోవాలని ఆదేశించారు. 

ప్రస్తుతం గ్యాస్ లీకేజీ దుర్ఘటన ప్రభావిత గ్రామాల్లో పరిస్థితి సాధారణ స్థితికి వచ్చిందంటూ మంత్రులు సీఎంకు వివరించారు. క్షతగాత్రులకు ప్రస్తుతం మంచి సదుపాయాలు అందేలా చూడాలని, తర్వాత కూడా వారికి వైద్య సేవల విషయంలో ఎలాంటి లోటుపాట్లు రాకుండా చూడాలన్నారు.  

సోమవారం ఉదయం నుండి మంత్రులు, అధికారులు కలిసి మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్‌గ్రేషియాను ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. గ్యాస్‌ లీక్‌ కారణంగా ప్రభావితమైన వారికి ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయం కోసం ప్రజలెవ్వరూ ఎక్కడా తిరగకుండా నేరుగా గ్రామ వాలంటీర్ల ద్వారా డోర్‌డెలివరీ చేయాలని సూచించారు. అత్యంత పారదర్శకంగా, ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని చేపట్టాలన్నారు. 

తమకు అందాల్సిన సహాయం కోసం ప్రజలు ఎవ్వరూ కూడా పదేపదే విజ్ఞాపనలు చేసే పరిస్థితి ఉండకూడదని అధికారులకు తెలిపారు ముఖ్యమంత్రి. పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందన్న అంశాన్ని నిపుణులు కూడా చెప్తున్నారని సీఎం పేర్కొన్నారు. 

ఇంతటి ప్రమాదానికి కారణమైన స్టెరిన్‌ రసాయనాన్ని విశాఖపట్నంలో ఉంచడానికి వీల్లేదని స్పష్టంచేశారు సీఎం. వివిధ ట్యాంకుల్లో, ఇతరత్రా చోట్ల ఉన్న స్టెరిన్‌ రసాయనాన్ని వెనక్కి పంపాలని సీఎం గట్టి ఆదేశాలిచ్చారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంచేసుకుని ఈ పని పూర్తిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

సీఎం నిర్వహించిన ఈ సమీక్షా సమావేశంలో విశాఖ ఇన్ఛార్జి మంత్రి కురసాల కన్నబాబు, సీఎస్‌ నీలం సాహ్నితో పాటు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు పాల్గొన్నారు. 

 

PREV
click me!

Recommended Stories

మోదీకి గాడ్సే కి తేడా ఉందా? YS Sharmila Comments | AP Congress | Asianet News Telugu
YS Jagan Comments: రాంబాబు చేసిన పనికి పొగడాలి అంబటిపై జగన్ కామెంట్స్| Asianet News Telugu