జనవరి 26వ తేదీనాటికి పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ కాన్పెప్ట్ను అమల్లోకి తీసుకురావడానికి అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని వైద్యారోగ్య శాఖ అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు.
అమరావతి: ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అమలుకు అవసరమైన 104 వాహనాల కొనుగోలు చేయనున్నట్లు... ఇందుకోసం చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. జనవరి 26వ తేదీనాటికి పూర్తిస్థాయిలో ఫ్యామిలీ డాక్టర్ కాన్పెప్ట్ను అమల్లోకి తీసుకురావడానికి అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని అధికారులకు సీఎం ఆదేశించారు.
కోవిడ్19 నివారణ, నియంత్రణ, వ్యాక్సినేషన్తో పాటు హెల్త్ హబ్స్పై వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో YS Jagan సమీక్షా సమావేశం చేపట్టారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఈ సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అధికారులకు కీలక ఆదేశాలిచ్చారు.
హెల్త్ హబ్స్లో ఏర్పాటు చేయనున్న ఆస్పత్రుల వివరాలను అడిగి తెలుసుకున్న సీఎం. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాంటి నగరాలకు వైద్యంకోసం వెళ్లాల్సిన అవసరం ఉండకూడదని అధికారులకు స్పష్టం చేసారు. మన రాష్ట్రంలోనే చికిత్స అందించే విధంగా ఉండాలని... ఏ రకమైన చికిత్సలకు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారో ఆయా ఆస్పత్రుల నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. అన్ని రకాల వైద్య సేవలు స్ధానికంగానే ప్రజలకు అందుబాటులోకి రావాలన్నారు. మనకు కావాల్సిన స్పెషలైజేషన్తో కూడిన ఆస్పత్రుల నిర్మాణంపై దృష్టి పెట్టాలన్నారు సీఎం.
రాష్ట్రంలో కొత్తగా చేపడుతున్న 16 మెడికల్కాలేజీల నిర్మాణ ప్రగతిపై సీఎం సమీక్షించారు. కొత్త మెడికల్ కాలేజీల విషయంలో ఏమైనా అంశాలు పెండింగ్లో ఉంటే... వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ నెలాఖరునాటికి వాటిని పరిష్కరించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. పనులు శరవేగంగా ముందుకు సాగాలని ఆదేశించారు.
read more గంజాయిపై ఉక్కుపాదం.. అదే, టీడీపీ నేతలకు కడుపుమంట: మంత్రి కన్నబాబు వ్యాఖ్యలు
మహిళలు, బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టిపెట్టాలని...స్వేచ్ఛా కార్యక్రమం ద్వారా బాలికల ఆరోగ్యంపై దృష్టిపెట్టామన్నారు. స్వేచ్ఛ ద్వారా బాలికల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు సీఎం. నెలకు ఒక్కసారి ఈ రకమైన కార్యక్రమం చేపడుతున్నామని... వీటిని దృష్టిలో ఉంచుకుని పీహెచ్సీ వైద్యుల నియామకాల్లో మహిళా డాక్టర్లకు ప్రాధాన్యత ఇవ్వాలన్న సీఎం ఆదేశించారు.
ఆరోగ్యశ్రీ పై గ్రామ, వార్డు సచివాలయాల్లో హోర్డింగ్స్ పెట్టాలని సీఎం అధికారులకు ఆదేశించారు. ఆరోగ్య శ్రీ రిఫరెల్ మీద ప్రచారం ఉండాలని... ఆరోగ్య మిత్రల ఫోన్నంబర్లను సచివాలయాల హోర్డింగ్స్లో ఉంచాలన్నారు. ఎమ్పానెల్ ఆస్పత్రుల జాబితాలను అందుబాటులో ఉంచాలని... డిజిటల్ పద్ధతుల్లో పౌరులకు ఎమ్పానెల్ ఆస్పత్రుల జాబితాలు అందుబాటులో ఉంచాలన్నారు. 108 వెహికల్స్ సిబ్బందికి కూడా రిఫరెల్ ఆస్పత్రుల జాబితా అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని), సీఎస్ సమీర్ శర్మ, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, కోవిడ్ టాస్క్ఫోర్స్ కమిటీ ఛైర్మన్ ఎంటీ కృష్ణబాబు, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, 104 కాల్ సెంటర్ ఇంఛార్జి బాబు, వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి నవీన్ కుమార్, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్, ఆరోగ్యశ్రీ సీఈఓ వి వినయ్ చంద్, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్ (డ్రగ్స్) రవిశంకర్, ఏపీవీవీపీ కమిషనర్ డాక్టర్ వి వినోద్ కుమార్ ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.