నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్... ఉపాధ్యాయ నియామకాలకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్

By Arun Kumar PFirst Published Jan 5, 2022, 4:36 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ, విద్యార్థులకు అందుతున్న బోధన, సౌకర్యాల కల్పణ తదితర అంశాలపై విద్యాశాఖ అధికారులతో చర్చించి కీలక ఆదేశాలిచ్చారు సీఎం జగన్. 

అమరావతి: నూతన విద్యా విధానానికి అనుగుణంగా స్కూళ్ల మ్యాపింగ్, సబ్జెక్టుల వారీగా బోధనా సిబ్బందిని నియమించాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ys jagan) విద్యాశాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయలను, ఇతరత్రా అవసరాలను గుర్తించి ఇతర సిబ్బందిని నియమించాలన్న సీఎం ఆదేశించారు. 

విద్యాశాఖ ఉన్నతాధికారులతో క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా స్కూళ్ల మ్యాపింగ్, జగనన్న విద్యాకానుక, నాడు-నేడు రెండో దశ, గోరుముద్ద, సంపూర్ణ పోషణ, స్కూళ్లలో టాయిలెట్ల నిర్వహణ, స్వేచ్ఛ తదితర అంశాలపై సీఎం అధికారులతో చర్చించారు. 

ఈ సందర్భంగా సీఎం జగన్ విద్యాశాఖ అధికారులకు పలు సలహాలు, సూచనలతో పాటు కీలకమైన ఆదేశాలిచ్చారు.  నాడు-నేడు తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వసతులు కల్పించాలని ఆదేశించారు. ఇప్పటికే ఏర్పాటు చేసిన వసతుల నిర్వహణపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం జగన్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. 

read more  ధైర్యం లేదు.. ఎప్పడూ ఎవరివో ఊతకర్రలు పట్టుకోవాల్సిందే: చంద్రబాబుపై సజ్జల విమర్శలు

నూతన విద్యావిధానం ప్రకారం ఆరు రకాల స్కూళ్లను ఏర్పాటుకు నిర్ణయించినట్లు... ఇప్పటికే కొన్నింటిని ఈ కొత్త విధానం ప్రకారం ఏర్పాటు చేశామన్నారు. మిగిలిన స్కూళ్ల మ్యాపింగ్‌పై దృష్టిపెట్టాలని... వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తిచేయాలని సీఎం జగన్ ఆదేశించారు. 

ప్రభుత్వ స్కూళ్ల నిర్వహణపై అధికారులకు సీఎం కీలక ఆదేశాలిచ్చారు. స్కూళ్ల మ్యాపింగ్‌కు అనుగుణంగా సిబ్బందిని నియామకం, బ్జెక్టుల వారీగా బోధనా సిబ్బంది, నాడు–నేడు తర్వాత పిల్లల సంఖ్య పెరిగిన నేపథ్యంలో అదనపు వసతుల కల్పనతో పాటు స్కూళ్లలో ఏర్పాటుచేసిన వసతుల నిర్వహణ ... ఈమూడు అంశాలపై దృష్టిపెట్టాలన్నారు. ఎప్పటికప్పుడు యాక్షన్‌ టేకెన్‌ రిపోర్టును తనకు నివేదించాలని ఆదేశించారు.

''ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల సంఖ్య పెరిగిన నేపథ్యంలో మళ్లీ అక్కడ ఏర్పాటు చేయాల్సిన మౌలిక వసతుల విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలి. పిల్లల సామర్థ్యానికి తగినట్టుగా వసతులు, బోధన సిబ్బందిని పెట్టాల్సి ఉంటుంది. నాడు ‌- నేడు మొదటి దశ, రెండో దశ తర్వాత పెరిగే పిల్లల సంఖ్యను పరిగణలోకి తీసుకుని అదనపు తరగతి గదులు, అదనంగా ఏర్పాటు చేయాల్సిన మౌలిక వసతులు, నియమించాల్సిన బోధనా సిబ్బందిపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలి'' అని సీఎం ఆదేశించారు.

 ''ప్రతి స్కూళ్లో సబ్జెక్టుల వారీగా బోధనా సిబ్బంది ఉండాలి. దీన్ని అమలు చేయడంలో ఉపాధ్యాయుల సహకారాన్ని తీసుకోవాలి. ఉపాధ్యాయులతో మాట్లాడి వారి సలహాలు, సూచనలు తీసుకుని సమర్థవంతంగా అమలు చేయాలి. పిల్లలకు మంచి చేసేందుకు తీసుకున్న నిర్ణయాలను వారికి వివరించి వారి భాగస్వామ్యాన్ని తీసుకోవాలి. ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తంచేస్తే వారిని కూడా పరిగణలోకి తీసుకుని వారి సూచనలతో ముందుకెళ్లాలి'' అని సీఎం ఆదేశించారు. 

గవర్నమెంట్ స్కూళ్లలో టీచర్లకు ఇంగ్లిషు బోధనపై అందిస్తున్న శిక్షణ కార్యక్రమాలకు సంబంధించిన వివరాలను అధికారులు సీఎంకు అందించారు. ఇంగ్లిషులో పరిజ్ఞానం కోసం ఉద్దేశించిన యాప్స్‌ను బాగా వినియోగించుకునేలా చూడాలని సీఎం జగన్ సూచించారు. 

read more  పీఆర్సీ‌పై పీటముడి: రేపు ఉద్యోగ సంఘాలతో సీఎం జగన్ భేటీ,రేపైనా తేలేనా?

జిల్లా అధికారులు నిరంతరం స్కూళ్లను పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. గోరుముద్ద నాణ్యత పరిశీలన కొనసాగాలని సూచించారు. వసతుల్లో, నిర్వహణలో లోపాలు ఉంటే వెంటనే నమోదుచేసి వాటిని సరిదిద్దడానికి చర్యలు తీసుకోవాలన్నారు. గోరుముద్ద కింద ఇంకా కొత్త వంటకాలను అందించడంపై దృష్టిపెట్టాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశించారు.

మన ఇంట్లో తినే తిండి ఎంత శుచిగా ఉండాలనుకుంటామో, టాయిలెట్లు ఎంత పరిశుభ్రంగా ఉండాలనుకుంటామో... స్కూళ్లలో వండే ఆహారం అంతే నాణ్యతగా ఉండాలని, టాయిలెట్లు కూడా అంతే పరిశుభ్రతతో ఉండేలా చూడాలన్నారు. ప్రభుత్వ పాఠశాల అనేది అందరిదీ అనే భావన రావాలన్న సీఎం జగన్ పేర్కొన్నారు. 

''అంగన్‌వాడీలు, స్కూళ్లలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులపై విలేజ్‌ క్లినిక్స్‌ దృష్టిపెట్టాలి. ఎప్పటికప్పుడు వారికి పరీక్షలు నిర్వహించాలి. రక్తహీనత లాంటి సమస్యల నివారణకు ఇది ఉపయోగపడుతుంది. పీహెచ్‌సీ డాక్టర్లకు అనుసంధానం చేస్తే వారు తగిన చికిత్సను అందిస్తారు'' అని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేసారు.


 

click me!