
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అత్యుత్తమ ప్రతిభ చూపిన వారికి ఏపీ సీఎం వైఎస్ జగన్ శుభవార్త చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి టెన్త్ టాపర్లుగా నిలిచిన విద్యార్ధులకు ప్రోత్సాహకాలు అందించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. గతంలో రాష్ట్ర స్థాయిలోనే ఈ అవార్డులు వుండగా.. వీటిని జిల్లా, నియోజకవర్గ స్థాయికి కూడా విస్తరించాలని సీఎం ఆదేశించారు. నియెజకవర్గ స్థాయిలో ఫస్ట్ ర్యాంకర్కి రూ.15 వేలు.. సెకండ్ ర్యాంకర్కి రూ.10 వేలు.. థర్డ్ ర్యాంకర్కి రూ.5 వేలు చొప్పున ప్రోత్సాహకాలు అందించాలని ముఖ్యమంత్రి సూచించారు.
ఇకపోతే... బుధవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో సామాన్య కుటుంబాలకు చెందిన విద్యార్ధులు చదువుకుంటారని అన్నారు. వారిని తీర్చిదిద్ది పోటీ ప్రపంచంలో నిలబడేలా చేస్తున్నామని .. మంచి మార్కులు సాధించిన విద్యార్ధులకు మరింత ప్రోత్సాహం కల్పించాలని నిర్ణయించామని బొత్స తెలిపారు. దీనిలో భాగంగా ఈ నెల 23న నియోజకవర్గాల వారీగా సమావేశాలు పెట్టి అవార్డులు ఇస్తామని మంత్రి పేర్కొన్నారు. ఈ నెల 27న జిల్లా స్థాయిలో అత్యధిక మార్కులు సాధించిన టెన్త్, ఇంటర్ విద్యార్ధులకు అవార్డులు అందిస్తామని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు.
Also Read: ప్రతిభ చూపిన ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులకు అవార్డ్లు.. స్టేట్ ఫస్ట్కు లక్ష రివార్డ్ : బొత్స
అలాగే ఈ నెల 31న రాష్ట్ర స్థాయిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్ధులను, ప్రిన్సిపాళ్లు, హెడ్ మాస్టర్స్, ఉపాధ్యాయులు, అధ్యాపకులను సత్కరిస్తామని మంత్రి పేర్కొన్నారు. దాదాపు 2831 మందిని సత్కరిస్తామని బొత్స తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో ప్రతిభ చూపిన విద్యార్ధులకు పతకం, మెరిట్ సర్టిఫికేట్.. జిల్లా స్థాయిలో ఫస్ట్ ప్లేస్ వచ్చిన విద్యార్ధికి రూ.50 వేలు, సెకండ్ ప్లేస్ రూ.30 వేలు, థర్డ్ ప్లేస్కి రూ.10 వేలు ఇస్తామన్నారు. ఇక రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ప్లేస్లో నిలిచిన విద్యార్ధికి రూ. లక్ష, సెకండ్ ప్లేస్ రూ.75 వేలు, థర్డ్ ప్లేస్ రూ.50 వేలను నగదు బహుమతిగా ఇస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్ర స్థాయిలో జరిగే ఈ కార్యక్రమానికి సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరవుతారని బొత్స సత్యనారాయణ వెల్లడించారు.